ఎస్డీసీ చెల్లదు!!
ABN , First Publish Date - 2021-08-02T07:52:55+05:30 IST
రాజ్యాంగానికి విరుద్ధంగా తమ కళ్లుగప్పి.. దొడ్డిదారిలో అప్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం..
దాని పేరిట రుణాలు తేవడం రాజ్యాంగ విరుద్ధం
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖాస్త్రం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాజ్యాంగానికి విరుద్ధంగా తమ కళ్లుగప్పి.. దొడ్డిదారిలో అప్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్(ఎ్సడీసీ)పై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, సదరు ఉల్లంఘనలకు జవాబివ్వాలని రాష్ట్రానికి లేఖాస్త్రం సంధించింది.
ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, భవిష్యత్ ఆదాయాన్ని ఆ కార్పొరేషన్కు ఎస్ర్కో చేయడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వరుస కథనాలపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ఖజానాకు రావలసిన భవిష్యత్ పన్ను ఆదాయాన్ని అప్పుల కోసం ఎస్డీసీకి ఎస్ర్కో చేయడం.. రాజ్యాంగంలోని 266(1)వ అఽధికరణకు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఆ కార్పొరేషన్ నుంచి రూ.18,500 కోట్ల రుణం తీసుకురావడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఎస్డీసీ అక్రమ వ్యవహారాలు కేంద్రం దృష్టికి చేరేనాటికి రూ.18,500 కోట్ల రుణమే తెచ్చినప్పటికీ.. తాజాగా ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఆ కార్పొరేషన్ నుంచి అక్రమంగా తెచ్చిన మొత్తం రుణం రూ.21,500 కోట్లకు చేరుకుంది. పైగా బ్యాంకుల నుంచి ఈ కార్పొరేషన్కు రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను సదరు కార్పొరేషన్ పేరిట బదిలీ చేసి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టడాన్నీ కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా ఆక్షేపించింది.