తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా

ABN , First Publish Date - 2020-08-09T04:12:38+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది.

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం తెలిసింది. ఇవాళ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


తాజాగా.. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోహిత్‌ను కుటుంబ సభ్యులు నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. గతవారం రోజులుగా ఆయన్ను కలిసిన కార్యకర్తలు, నేతలు, బంధువులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవడం లేదా హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యాధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-09T04:12:38+05:30 IST