నాపై ఫిర్యాదు చేసినవారికే ఇస్తా... ప్లేటు ఫిరాయిస్తున్న శిల్పాచౌదరి!

ABN , First Publish Date - 2021-12-07T08:27:50+05:30 IST

వందల కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి తాను తీసుకున్న అప్పుల విషయంలో ప్లేటు ఫిరాయించినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీసు కస్టడీలో.. ఆమె కొల్లగొట్టిన డబ్బు ఎక్కడ దాచిందనే విషయంపై భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు

నాపై ఫిర్యాదు చేసినవారికే ఇస్తా... ప్లేటు ఫిరాయిస్తున్న శిల్పాచౌదరి!

  • మిగతావారికి అసలు కంటే ఎక్కువే ఇచ్చానని వాంగ్మూలం
  • ఓ ముగ్గురి వద్ద పెట్టుబడులపై బుకాయింపు! 
  • శిల్ప దంపతుల కస్టడీకి మరోమారు పోలీసుల పిటిషన్‌


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడ్డట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి తాను తీసుకున్న అప్పుల విషయంలో ప్లేటు ఫిరాయించినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీసు కస్టడీలో.. ఆమె కొల్లగొట్టిన డబ్బు ఎక్కడ దాచిందనే విషయంపై భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ‘‘రాధికారెడ్డి, మల్లారెడ్డి, ప్రతా్‌పరెడ్డి వద్ద నేను డబ్బు పెట్టాను. వారు నన్ను మోసం చేశారు’’ అని వాంగ్మూలమిచ్చినట్లు తెలిసింది. ఈ విషయం ఎలకా్ట్రనిక్‌ మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌గా మారడంతో.. రాధికారెడ్డి స్వచ్ఛందంగా పోలీసుల ముందుకు వచ్చారు. మాదాపూర్‌ ఏసీపీ, డీసీపీలను కలిసి.. శిల్పాచౌదరి తన వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడానికి ముప్పుతిప్పులు పెడుతోందని, ఆమె తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేని స్పష్టం చేశారు. మిగతా ఇద్దరు కూడా నేడోరేపో పోలీసుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు.. తనపై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే డబ్బులు తిరిగి చెల్లిస్తానంటూ శిల్పా  కొత్త పాట అందుకున్నట్లు తెలిసింది. చాలా మంది పెద్దలు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని శిల్పకు అందజేసిన నేపథ్యంలో.. ఐటీ భయంతో వారు ఫిర్యాదు చేసే అవకాశాలు లేవు.


దీన్ని శిల్ప అవకాశంగా మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘వారికి అధిక వడ్డీ చెల్లించాను. మొత్తం లెక్కగడితే.. అసలు కంటే వడ్డీలే ఎక్కువగా ముట్టాయి’’ అని మాట్లాడినట్లు తెలిసింది. శిల్పాచౌదరి దంపతులను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నా.. పోలీసులు పెద్దగా సమాచారాన్ని రాబట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో మిగతా రెండు కేసుల్లో ఐదు రోజుల కస్టడీ కోసం ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం వాదనలు జరిగే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-12-07T08:27:50+05:30 IST