సెమీస్ కు సింధు, సేన్‌

ABN , First Publish Date - 2022-01-15T09:19:37+05:30 IST

సెమీస్ కు సింధు, సేన్‌

సెమీస్ కు  సింధు, సేన్‌

న్యూఢిల్లీ: టాప్‌సీడ్‌ పీవీ సింధు, యువ కెరటం లక్ష్యసేన్‌ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఈ ఇద్దరూ సింగిల్స్‌లో తమ విభాగాల్లో సెమీఫైనల్లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్‌ సింధు 21-7, 21-18తో భారత్‌కే చెందిన అస్మితా చాలిహాపై వరుసగేముల్లో గెలుపొందింది. ఇక, గతరౌండ్లో సీనియర్‌ సైనా నెహ్వాల్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన నాగ్‌పూర్‌ షట్లర్‌ మాల్విక బన్సోద్‌ పోరాటం క్వార్టర్స్‌కే పరిమితమైంది. భారత అమ్మాయి ఆకర్షి కశ్యప్‌ 21-12, 21-15తో మాల్వికను ఓడించింది. సెమీఫైనల్స్‌లో ఆరోసీడ్‌ సుపనిద కాటెతాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు, రెండోసీడ్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో ఆకర్షి తలపడనున్నారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌ 14-21, 21-9, 21-14తో సహచరుడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై గెలిచి ఎంగ్‌ జీ యోంగ్‌ (మలేసియా)తో సెమీ్‌సకు సిద్ధమయ్యాడు. మరో సెమీ్‌సలో ప్రపంచ చాంపియన్‌ లో కీన్‌ యే (సింగపూర్‌)ను బ్రియాన్‌ యాంగ్‌ (కెనడా) ఢీకొంటాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి 21-18, 21-18తో సింగపూర్‌ ద్వయం హీ యోంగ్‌-లో కీన్‌పై నెగ్గి సెమీస్‌ చేరింది.   

Updated Date - 2022-01-15T09:19:37+05:30 IST