తిరుపతి ప్రజలకు అండగా నిలవండి: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-11-19T01:52:12+05:30 IST
భారీవర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు టీడీపీ కార్యకర్తలు కేడర్ అండగా నిలవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
అమరావతి: భారీవర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు టీడీపీ కార్యకర్తలు కేడర్ అండగా నిలవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో అవసరమైన సేవలందించాలని కోరారు. అధికార యంత్రాంగం సహకారంతో ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తిరుపతి వచ్చి చిక్కుకు పోయిన భక్తులకు సహాయ,సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రాణాపాయం కలగకుండా జాగత్తవహించాలన్నారు. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని ఆయన తప్పుబట్టారు. యుద్దప్రాతిపదికన సహాయ, సహకారాలు అందించాల్సిందిగా ప్రభుత్వానికి చంద్రబాబు విజ్జప్తి చేశారు.
భారీ వర్షంతో చిత్తూరు నగరం చుట్టూ వర్షపు నీరు చేరింది. వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీవా నది పొంగిపొర్లుతోంది. దొడ్డిపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి నీటి ప్రవాహంలో స్కూల్ బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. చిత్తూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు గంగినేని చెరువు కట్ట ప్రమాదపు అంచుల్లో ఉంది. అటు గంగినేని చెరువులో నీటి మట్టం పెరగడంతో మిట్టూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.