లాక్ పెడితే ఆర్థికం డౌన్!
ABN , First Publish Date - 2021-04-09T08:08:19+05:30 IST
‘‘రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గత ఏడాది కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల నష్టం వచ్చింది. అటువంటి పరిస్థితి తిరిగి రాకుండా అధికారులు చూడాలి. కొవిడ్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’’ అని సీఎం జగన్...
- గత ఏడాది రూ.21 వేల కోట్లు నష్టం: సీఎం
- మరోసారి ఆ పరిస్థితి ఉండకూడదు
- సర్కారీ ధరలకే ప్రైవేటులోనూ చికిత్స
- ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు
- కొవిడ్పై సమీక్షించిన సీఎం జగన్
- ఏపీకి సరిపడా వ్యాక్సిన్ రావడంలేదు
- మరో 2 రోజులకు మాత్రమే డోసులు
- సీఎంకు వివరించిన అధికారులు
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గత ఏడాది కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల నష్టం వచ్చింది. అటువంటి పరిస్థితి తిరిగి రాకుండా అధికారులు చూడాలి. కొవిడ్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి’’ అని సీఎం జగన్... అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలో ‘ఆస్పత్రుల్లో నాడు-నేడు’పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా గతంలో ఏవిధంగా సేవలు అందించామో, ఇప్పుడు కూడా అదేవిధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. టీకాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ జరగడానికి వీల్లేదని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే చికిత్స జరగాలని స్పష్టం చేశారు. అధిక ఫీజులపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆస్పత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ‘‘మాస్క్ పెట్టుకోనివారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. కరోనా వచ్చినవారు 104కి ఫోన్ చేస్తే వెంటనే బెడ్ సమకూర్చాలి. పేషంట్లకు ఉచితంగా సేవలు అందించాలి. కొవిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆరోగ్యమిత్రలు సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం ఆదేశించారు. హోంఐసొలేషన్ కొవిడ్ మెడికల్ కిట్లు నాలుగు లక్షల వరకూ అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. గుంటూరు, చిత్తూరు, విశాఖ, కృష్ణాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.
వ్యాక్సిన్ కొరత ఉంది...
రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షలమందికి కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. కానీ రాష్ట్రంలో తగినన్ని డోసుల వ్యాక్సిన్ అందుబాటులో లేవని వారు సీఎంకు వివరించారు. గురువారంనాటికి మూడు లక్షల డోసులు మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, అవి రెండురోజులకే వస్తాయని చెప్పారు. అవసరాలకు తగినన్ని డోసుల వ్యాక్సిన్ సరఫరా కావడం లేదని సీఎంకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడి ఇంకా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సినవారు సుమారు కోటి మంది వరకూ ఉంటారని అధికారులు వివరించారు. వారికీ నెల రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. కాగా, జూలై 1వ తేదీ నాటికి కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో ఎనిమిది కాలేజీలకు భూసేకరణ పూర్తి అయిందని సీఎంకు అధికారులు తెలిపారు. మిగిలిన ఎనిమిదింటికి కూడా భూసేకరణ త్వరతిగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి మొత్తం కాలేజీలకు భూసేకరణ పూర్తి కావాలని తెలిపారు. దీనికి సంబంధించి ఎస్వోపీలు తయారు చేయాలని, కొత్త మెడికల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ పకడ్బందీగా జరగాలని స్పష్టం చేశారు. హాస్పిటల్ డెవల్పమెంట్ ఫండ్ విడుదల విషయంలో జాప్యం జరగకూడదని సీఎం జగన్ అన్నారు. దీనిపై ఒక పాలసీ రూపొందించి, ఒక ప్రొసీజర్ ప్రకారం ఎప్పటికప్పుడు పనులు చేపట్టాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణను మెడికల్ సూపరింటెండెంట్లకే వదిలేయడం వల్ల మేనేజ్మెంట్ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిర్వహణ శాస్త్రీయంగా ఉండడానికి ఆస్పత్రి మేనేజర్లను నియమించుకోవాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో మేనేజ్మెంట్ పోస్ట్ల పదోన్నతులు పనితీరు ఆధారగా ఉండాలని తప్ప సిఫారసుల ఆధారంగా కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు.