యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-12T04:22:04+05:30 IST

తనను ప్రేమించకుంటే చనిపోతానని ఓ యువకుడు వేధించడంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్‌ మండలం, వెంకటగిరి గ్రామంలో జరిగింది.

యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ఖమ్మం రూరల్‌, సెప్టెంబరు 11: తనను ప్రేమించకుంటే చనిపోతానని ఓ యువకుడు వేధించడంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్‌ మండలం, వెంకటగిరి గ్రామంలో జరిగింది. వెంకటగిరి గ్రామానికి చెందిన బాలిక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన పేరబోయిన సాయికృష్ణ (20)అనే యువకుడు సదరు బాలిక పాఠశాలకు వెళ్లే సమయంలో తనను ప్రేమించాలని నిత్యం వేధించేవాడు. ఈ విషయాన్ని గతంలో బాలిక తన తల్లి,దండ్రులకు తెలియచేయగా వారు సాయికృష్ణను మందలించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈక్రమంలో 9వ తేదీన సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న బాలికతో తనను ప్రేమించకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక ఆరోజు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. బాలిక తల్లి,దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-12T04:22:04+05:30 IST