మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు Supreme courtలో చుక్కెదురు..
ABN , First Publish Date - 2021-10-08T16:45:34+05:30 IST
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి అనుమతి జారీ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తుది ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. తదుపరి విచారణ దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
గతంలో ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 22న సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. ఆదిమూలపు సురేష్తో పాటు ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన సతీమణి విజయలక్ష్మిపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ 2016లోనే కేసు నమోదు చేసింది. 2017లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
కాగా.. దీనిని సవాల్ చేస్తూ సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నందున మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో నేడు సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.