విదేశీ లీగ్లు ఆడేందుకు మాకు అనుమతి ఇవ్వాలి.. ఎందుకంటే: సురేశ్ రైనా
ABN , First Publish Date - 2020-06-01T20:32:57+05:30 IST
విదేశీ లీగ్లు ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వాలని.. బీసీసీఐని కోరిన తొలి భారత క్రికెటర్గా సురేశ్ రైనా నిలిచిన విషయం తెలిసిందే. బీసీసీఐ
న్యూఢిల్లీ: విదేశీ లీగ్లు ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వాలని.. బీసీసీఐని కోరిన తొలి భారత క్రికెటర్గా సురేశ్ రైనా నిలిచిన విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత ఆటగాళ్లు కేవలం దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఇతర లీగ్లో ఆడేందుకు వాళ్లని బీసీసీఐ అనుమతిస్తుంది. అయితే సురేశ్ రైనా మాత్రం తమకు ముందే అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరి షాక్ ఇచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప వంటి క్రికెటర్లూ రైనాకు మద్దతు ఇచ్చారు.
అయితే కేవలం డబ్బు కోసం మాత్రం తాను విదేశీ లీగ్లు ఆడుతానని అనలేదని.. టీం ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా వెల్లడించాడు. ‘‘డబ్బు కోసం కాదు.. ఐపీఎల్లో సంపాదించేంత డబ్బు.. ఇంకా ఎక్కడా దొరకదు. 10 సంవత్సరాలపాటు విదేశీ లీగ్లు ఆడినా.. అంత డబ్బు రాదు. విషయం ఏంటంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత కాంట్రాక్ట్లో లేని ఆటగాళ్లకు ఓ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే.. మాకు ప్రాక్టీస్ కావాలి. ఖాళీగా రెండు నెలలు ఇంట్లో కూర్చుంటే.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినా విశ్వాసం రాదు. కాబట్టే మేము క్రికెట్ ఆడాలి. కానీ, డబ్బు కోసం కాదు. నా వద్ద ఉన్న డబ్బు నాకు చాలు’’ అని రైనా స్పష్టం చేశాడు.