ఆ భూమి తమదే అంటూ తల్లి కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-06-06T04:40:14+05:30 IST
26 కుంటల వ్యవసాయభూమికి సంబందించి తల్లికూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇరువర్గాలు స్టేషన్లో ఫిర్యాదు
కొణిజర్ల, జూన్ 5: 26 కుంటల వ్యవసాయభూమికి సంబందించి తల్లికూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ రవి తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని తీగలబంజర గ్రామానికి చెందిన వంగూరి అనసూర్యమ్మ, ఆమె కుమార్తె సుజాత సింగరాయపాలెం రెవెన్యూ పరిధిలో గల 26 కుంటల భూమి కోసం రెండు రోజుల క్రితం పురుగులమందు తాగగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అనసూర్యమ్మ కుమారుడు బాబు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం శ్రీనివాసరావు అనే ప్రజాప్రతినిధి తమ భూమిని అతని పేరుమీద చేసుకున్నాడని, గ్రామానికి చెందిన వ్యక్తికి కౌలుకు కూడ ఇచ్చాడని, ఆ భూమిలోకి వెళ్తుంటే కౌలుదారుడు రానివ్వడంలేదన్నారు. దాంతో మనస్థాపంతో పురుగులమందు తాగారని, ఇప్పటికైన తమ భూమిని తమకు ఇప్పించాలని, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కౌలురైతు కూడ ఆత్మహత్యాయత్నం చేసిన తల్లికూతుళ్లపై ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఇరువురు నుంచి ఫిర్యాదులు వచ్చాయని, విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనసూర్యమ్మ కుమారుడు బాబు ఈ విషయంపై న్యాయం చేయాలని ఎస్సీఎస్టీ కమిషన్కు పిర్యాదు చేశాడని, కమిషనర్ ఆదేశాలు ప్రకారం విచారణ చేయగా 2005లో శ్రీనివాసరావు అనే వ్యక్తి సాదాఅగ్రీమెంటు ప్రకారం సదరు భూమిని కొనుగోలు చేశాడని అనంతరం ఆర్వోఆర్ పట్టాలు పొందాడని తెలిపారు. ప్రజాప్రతినిధి భర్త శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబందనలు ప్రకారం 26కుంటలు భూమిని కొనుగోలు చేశానని, అన్ని ఆధారాలు ఉన్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇదంతా జరుగుతుందని పేర్కొన్నారు.