అమెరికాలో ఘోరం.. క్రిస్మస్ పరేడ్పై ఎస్యూవీ దూసుకెళ్లడంతో..
ABN , First Publish Date - 2021-11-23T00:53:41+05:30 IST
అమెరికాలో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ పరేడ్పైకి ఓ భారీ ఎస్యూవీ దూసుకెళ్లడంతో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వాషింగ్టన్: అమెరికాలో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ పరేడ్పైకి ఓ భారీ ఎస్యూవీ దూసుకెళ్లడంతో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని వాకీషా టౌన్లో ఆదివారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. ఈ పరేడ్లో పిల్లలు కూడా పాల్గొనడంతో వారి తల్లిదండ్రులు తమ చిన్నారులకు ప్రమాదంలో పడ్డారేమోనని తల్లడిల్లిపోయారు. మృతి చెందిన వారిలో తన కూతురు ఉందేమోనన్న ఆందోళనతో ఓ తండ్రి అక్కడ వెతుకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ.. పోలీసులు మాత్రం ఇప్పటివరకూ ఈ విషయమై ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ప్రతి ఏటా క్రిస్మస్కు కొద్ది రోజుల ముందు స్థానికులు ఈ పరేడ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి ట్రాఫిక్ కెమెరాల్లో రికార్డయ్యాయి. బారికేడ్లను తోసుకుంటూ కారు పరేడ్పైకి దూసుకొచ్చినట్టు రికార్డయ్యింది. ప్రమాదం సమయంలో అక్కడే ఉన్నఓ పోలీసు అధికారి ఆ ఎస్యూవీపై కాల్పులు జరిపినా కారు ఆగకుండా ముందుకెళ్లిపోయింది. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు.