టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2020-03-14T17:49:15+05:30 IST
చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) 2020, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) 2020, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. స్థానిక అర్లింగ్టన్ హైట్స్లోని అట్లాంటిస్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మంది మహిళలకు పైగా హాజరయ్యారు. క్రాంతి కాజా, ఉమా అవదూత, నీలిమ చేకిచర్ల, వినీత పొద్దుటూరి, అర్చన పొద్దుటూరి, ప్రసన్న కందుకూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను టీఏజీసీ బోర్డు సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. సభ వేదికను చాలా చక్కగా అలంకరించడంతో పాటు హాల్లో వినూత్నంగా ఏర్పాటు చేసిన బైక్ అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే వివిధ వినోద కార్యక్రమాలతో కొనసాగిన ఈ ఈవెంట్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రధానంగా టిక్టాక్ కాంటెస్ట్ ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఈ కాంటెస్ట్లో గెలిచిన వారికి సిటీ ఎయిర్ వారు బహుమతులు, ట్రావెల్ వొచర్స్ అందజేశారు. టీఏజీసీ మహిళా ఫోరమ్ రికార్డు స్థాయిలో విరాళాలను సేకరించి బై ది హ్యాండ్ కిడ్స్ క్లబ్ వారికి అందించారు. ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు బావార్చి, షాంబర్గ్ వారు రుచికరమైన ఆహారాలను వడ్డించారు.
టీఏజీసీ అధ్యక్షులు ప్రవీణ్ వేములపల్లి ఈ కార్యక్రమ దాతలు సిటీ ఎయిర్ ట్రావెల్స్, రాఫెల్ బహుమతుల దాతలు రీగల్ జ్యూవెల్లెర్స్, పిక్సెల్ బ్లింక్స్ ఫోటోగ్రఫీ సందీప్, హాల్ను అలంకరణ చేసిన ఖాస్ డెకార్స్, డిన్నర్ ప్రదాతలు బావార్చి బిరియానిస్ షాంబర్గ్, హాజరైన అతిథులకు, నిర్వాహకులకు, వాలంటీర్లకు, బోర్డు ప్రతినిధులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. టీఏజీసీ మహిళా ఫోరమ్ చైర్మన్ ఉమా అవదూత, ఇతర మహిళా డైరెక్టర్లు, వాలంటీర్లు గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ్యటానికి శ్రమించారని ఆయన గుర్తు చేశారు.
వేదిక అలంకరణ చేసిన నీలిమ చేకిచర్ల, ఇతర వాలంటీర్లకు, అతిథుల ఆహ్వాన, రిజిస్ట్రేషన్కు సహాయాన్ని అందించిన బోర్డు మెంబర్లు వెంకట్ గునుగంటి, అంజిరెడ్డి కందిమళ్ల, రమణ కాల్వలకు, ఆహార ఏర్పాట్లను పర్యవేక్షించిన సంతోష్ కొండూరి, నవీన్ ఎడుమ, శశి చావాకు ఉమా అవదూత కృతజ్ఞతలు తెలిపారు.