పాకిస్థాన్కు వ్యతిరేకంగా కాబూల్లో మహిళల నిరసన.. తాలిబన్ల కాల్పులు
ABN , First Publish Date - 2021-09-07T21:01:24+05:30 IST
పాక్ ప్రభుత్వానికి, ఐఎస్ఐకి వ్యతిరేకంగా కాబూల్ వాసులు నిర్వహించిన నిరసనపై తూటాలు పేలాయి. ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో
కాబూల్: పాక్ ప్రభుత్వానికి, ఐఎస్ఐకి వ్యతిరేకంగా కాబూల్ వాసులు నిర్వహించిన నిరసనపై తూటాలు పేలాయి. ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని నిరసిస్తూ మహిళలు సహా పలువురు నిరసనకారులు రోడ్డెక్కారు. పాకిస్థాన్, ఐఎస్ఐకి వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టు ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
రాజధాని కాబూల్లోని అధ్యక్ష భవనం సమీపంలో కలుసుకున్న నిరసనకారులు అక్కడి నుంచి పాకిస్థాన్ ఐఎస్ఐ డైరెక్టర్ బస చేసిన కాబూల్ సెరేనా హోటల్కు ర్యాలీ ప్రారంభించారు. పాక్ ఐఎస్ఐ డైరెక్టర్ గత వారం రోజులుగా అదే హోటల్లో బస చేస్తున్నారు.
వందలాదిమంది మహిళలు, పురుషులు పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన వీడియోలను స్థానిక అశ్వక న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లోని బల్ఖ్ ప్రావిన్స్కు కూడా ఈ నిరసనలు పాకాయి. అక్కడా వందలాదిమంది వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. ‘డెత్ టు పాకిస్థాన్’, ‘డెత్ టు ఐఎస్ఐ’ అంటూ నినదించిన నిరసనకారులు తమ స్వాతంత్ర్యం కావాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బురఖాలు ధరించిన మహిళలు వెల్లువలా కాబూల్ వీధుల్లోకి తరలిరావడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.