జాయింట్ వెంచర్‌కు.. ఫోర్డ్‌, మహీంద్రాల ‘టాటా’...

ABN , First Publish Date - 2021-01-01T21:00:45+05:30 IST

దేశీయంగా భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు తెరదించినట్లు ఆటో రంగ దిగ్గజాలు ఫోర్డ్‌ మోటార్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా వెల్లడించాయి. కోవిడ్‌-19 నేపధ్యంలో గత ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జేవీ ఆలోచనను విరమించుకున్నట్లు రెండు కంపెనీలూ విడిగా వెల్లడించాయి.

జాయింట్ వెంచర్‌కు.. ఫోర్డ్‌, మహీంద్రాల ‘టాటా’...

న్యూఢిల్లీ : దేశీయంగా భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు తెరదించినట్లు ఆటో రంగ దిగ్గజాలు ఫోర్డ్‌ మోటార్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా వెల్లడించాయి. కోవిడ్‌-19 నేపధ్యంలో గత ఒకటిన్నర సంవత్సరాలుగా  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జేవీ ఆలోచనను విరమించుకున్నట్లు రెండు కంపెనీలూ విడిగా వెల్లడించాయి. గతేడాది అక్టోబరుతో పోలిస్తే వ్యాపార వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు ఫోర్డ్‌ మోటార్‌ ప్రతినిధి టీఆర్‌ రీడ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జేవీ ఏర్పాటుకు ఏడాది కాలంగా రెండు కంపెనీలూ ప్రణాళికలు వేస్తూ వచ్చాయి. ఇందుకు గడువు డిసెంబర్‌ 31తో ముగియడంతో జేవీ ఆలోచనకు స్వస్తి చెప్పాయి. నిజానికి తొలి ప్రణాళికల ప్రకారం పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదా గడువును పెంచుకోవడం వంటివి చేపట్టవలసి ఉన్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. అయితే కోవిడ్‌-19 కారణంగా మారిన పరిస్థితులతో వెనకడుగు వేసినట్లు పేర్కొన్నాయి.


ప్రస్తుత మార్కెట్లకు...

ప్రస్తుత మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా చౌక వ్యయాలతో వాహనాల తయారీ కోసం ఫోర్డ్‌, ఎంఅండ్‌ఎం జేవీని ఏర్పాటు చేయాలని 2019 లో ప్రణాళికలు వేశాయి. వీటిలో భాగంగా మూడు కొత్త యుటిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలని భావించాయి. మధ్యతరహా ఎస్‌యూవీ తయారీతో వీటిని ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా రూపొందించాలని భావించాయి. ఇదిలా ఉంటే... ప్రస్తుత పరిస్థితుల్లో వాహన తయారీ ప్రణాళికలపై ఎలాంటి వివరాలనూ వెల్లడించలేమని రీడ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2021-01-01T21:00:45+05:30 IST