అసెంబ్లీ భేటీని బహిష్కరిస్తున్నాం

ABN , First Publish Date - 2021-05-19T09:13:11+05:30 IST

ఒక రోజుపాటు నిర్వహించతలపెట్టిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఆన్‌లైన్‌లో జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో...

అసెంబ్లీ భేటీని బహిష్కరిస్తున్నాం

  • తూతూమంత్రం సమావేశంతో ఉపయోగం లేదు
  • మాక్‌ అసెంబ్లీ పెట్టి సమస్యలపై చర్చిస్తాం: టీడీపీ

అమరావతి/విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి): ఒక రోజుపాటు నిర్వహించతలపెట్టిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఆన్‌లైన్‌లో జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తూతూమంత్రంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించడం వల్ల ఏ ప్రయోజనం లేదని, అందుకే దానిని బహిష్కరించాలని నిర్ణయించామని సమావేశానంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విలేకరులకు తెలియజేశారు. అసెంబ్లీ పెడుతున్న గురువారం రోజు తాము మాక్‌ అసెంబ్లీ నిర్వహించి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, ప్రజల పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పారు. ‘‘ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ పెట్టి బడ్జెట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు 900 మాత్రమే ఉన్నాయి. కేంద్రం పార్లమెంటు సమావేశాలను, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాలను ఆ సమయంలో నిర్వహించి బడ్జెట్లను ఆమోదింపజేసుకొన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ అంటే లెక్కలేనితనంతో సమావేశాలు పెట్టలేదు. ఇప్పుడు రెండు లక్షల క్రియాశీల కేసులు ఉన్నప్పుడు అసెంబ్లీ పెడతామని అంటున్నారు. అది అసెంబ్లీపై ప్రేమ కాదు. ఆరు నెలల్లోపు అసెంబ్లీని పెట్టాల్సిన రాజ్యాంగ అవసరం రీత్యా పెడుతున్నారు. అది కూడా కేవలం ఒక రోజు పెట్టి దులుపుకొని పోతున్నారు. ఆ ఒక్క రోజులోనే గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ ఆమోదం రెండూ అవగొట్టేసుకొని పోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంత మొక్కుబడి తంతులో మేం భాగస్వాములం కాదల్చుకోలేదు. అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకొన్నాం’’ అని అచ్చెన్నాయుడు వివరించారు. ‘‘మన పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ అఖిలపక్ష సమావేశాలు పెట్టి చర్చించాయి. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఇతర పార్టీలతో మాట్లాడరు. వైద్య నిపుణులతో సమావేశాలు పెట్టరు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పినా లక్ష్య పెట్టలేదు.


రాష్ట్రంలో ఆస్పత్రుల్లో పడకలు లేవు. ఆక్సిజన్‌ లేదు. ఇంజక్షన్లు లేవు. మందులు లేవు. సమస్య వచ్చిన వారు ప్రాణాలు అరచేత పట్టుకొని ఊరూరా... ప్రతి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆ శక్తి లేనివారు నిస్సహాయంగా చనిపోతున్నారు. ప్రాణాలు కాపాడటం చేతగాక చనిపోయిన తర్వాత అంత్యక్రియల ఖర్చుకు రూ.15 వేలు ఇస్తామని పెద్ద గొప్పగా చెబుతున్నారు. సిగ్గుపడాలి’’ అని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉంటే ముఖ్యమంత్రి జగన్‌ నీరో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు. తనను పొగడటం కోసమే సమావేశాలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘ఎప్పుడో అరుదుగా ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ ఆమోదించుకుంటారు. వరుసగా రెండేళ్లు మన దగ్గర ఇదే పని చేశారు. ఈ ముఖ్యమంత్రికి న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, మీడియా దేనిపైనా గౌరవం లేదు. అన్నింటిని అణగదొక్కాలని అనుకొంటున్నారు’’ అని మండిపడ్డారు.


Updated Date - 2021-05-19T09:13:11+05:30 IST