గత ప్రభుత్వాలు ఇలా చేస్తే హైదరాబాద్‌ ఉండేదా?: chandrababu

ABN , First Publish Date - 2022-01-04T19:12:24+05:30 IST

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వాలు ఇలా చేస్తే హైదరాబాద్‌ ఉండేదా?: chandrababu

గుంటూరు: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలని...  జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని సూచించారు. రాష్ట్రంలో విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారన్నారు. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారని మండిపడ్డారు. ‘‘నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు’’ అని బాబు అన్నారు. రాజధాని కోసం 50 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారని... రాజధానిలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్‌ ఉండేదా అని ప్రశ్నించారు.


ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి మాట తప్పారన్నారు. కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరమని తెలిపారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. ‘‘పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారు?... పోలవరం పూర్తి  చేయడం మీకు చేతనవుతుందా?... పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా?’’ అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదన్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసినట్లు తెలిపారు. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-04T19:12:24+05:30 IST