పార్లమెంటు సాక్షిగా ఎంపీ రఘురామను వైసీపీ అవమానించింది: ఎమ్మెల్సీ మంతెన
ABN , First Publish Date - 2021-12-08T16:07:19+05:30 IST
పార్లమెంటు సాక్షిగా ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ అవమానించిందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన విమర్శించారు.
అమరావతి: పార్లమెంటు సాక్షిగా ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ అవమానించిందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యను ఎత్తిచూపితే ఎదురుదాడికి దిగడం వైసీపీ ప్రభుత్వంలో రివాజుగా మారిందన్నారు. వరదల అంశాన్ని పక్కదారి పట్టించడానికే అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన వైసీపీ నేతలు... ఇప్పుడు ఈ జాడ్యాన్ని పార్లమెంటుకు కూడా అంటించారని ఆరోపించారు. క్షత్రియ సామాజికవర్గం ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ప్రతిఘటిస్తామన్నారు. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతమైతే ఊరుకోమని హెచ్చరించారు. పార్లమెంటులో అసభ్య పదజాలం వాడిన వైసీపీ ఎంపీలపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రఘురామక్రష్ణంరాజుకు ఏదైనా జరిగితే వైసీపీదే బాధ్యతని మంతెన సత్యనారాయణ రాజు అన్నారు.