అమరావతి: ఆర్టీసీ సంస్థకు చెందిన 1300 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 33ఏళ్లపాటు లీజుకు ఇస్తే, దాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జగన్, నేడు 50ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడన్నారు. విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి నగరాల్లోని రూ.1500కోట్ల విలువచేసే ఆర్టీసీ స్థలాలు 50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉంటే, తిరిగి సంస్థ స్వాధీనం అవుతాయా? అని ఆయన ప్రశ్నించారు. లీజుదారులు కోర్టులకు వెళ్లి, ఏళ్లకు ఏళ్లు భూములను అనుభవించడాన్ని ఇప్పటికీ చూస్తున్నామన్నారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని సూచించారు. ఆర్టీసీ, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల తలెత్తే సమస్యలను అర్థమయ్యేలా చెప్పాలన్నారు.