సకల జాగ్రత్తలతో బోధన!

ABN , First Publish Date - 2021-06-13T09:17:36+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. బడికి వెళ్లి హాయిగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఏడాదిన్నరగా ఇళ్లకే పరిమితమయ్యారు.

సకల జాగ్రత్తలతో బోధన!

  • ప్రత్యేకంగా హెల్త్‌ చెకప్‌ రూమ్‌..
  • డబుల్‌ మాస్క్‌, ఫేస్‌షీల్డు తప్పనిసరి
  • హైదరాబాద్‌లో ప్రైవేటు విద్యా సంస్థల కసరత్తు
  • విదేశాల్లో ఇదే పద్ధతి అమలు
  • ఈ విధానం అమలుకు విద్యాశాఖ యోచన


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కారణంగా పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. బడికి వెళ్లి హాయిగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఏడాదిన్నరగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల కంప్యూటర్లు, ఫోన్లతోనే గడిపేస్తున్నారు. గడప దాటి బయటికెళ్తే ఎక్కడ కరోనా బారిన పడతారోన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అదేసమయం లో వారి విద్యాభ్యాసంపైనా దిగులు చెందుతున్నారు. చిన్నారుల భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. ఈ క్ర మంలో పిల్లలను కొవిడ్‌ బారి నుంచి కాపాడుతూ.. వా రికి రక్షణతో కూడిన బోధన అందించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌, టెక్నో స్కూళ్లు ప్రయత్నిస్తున్నాయి. తరగతి గదుల రూపురేఖలు మార్చి, ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించి పాఠాలు చెప్పేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి. కొవిడ్‌ కేసులు భారీ గా తగ్గిన అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే ప్రాథమి క, ఉన్నత తరగతుల పిల్లలకు గట్టి భద్రతల నడుమ క్లాస్‌రూమ్‌ బోధనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని పాఠశాలలు ఇదే తరహాలో పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. 


అర్థం కాని ఆన్‌లైన్‌ పాఠాలు..

ప్రైవేట్‌ విద్యాసంస్థలతోపాటు సర్కారు స్కూళ్లలో సైతం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి 60 శాతం మంది పిల్లలు పాఠాలను ఆసక్తిగా వినగా.. మిగతా 40 శాతం మంది కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు, స్మార్ట్‌ఫోన్లలో కాలక్షేపం చేసిన పరిస్థితి నెలకొంది.   


డబుల్‌ మాస్క్‌, ఫేస్‌షీల్డు..

రెండేళ్లుగా పిల్లలు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉం టుండడంతో వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. ఈ నెల 15 తర్వాత నుంచి 2021-22 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన పక్షంలో తరగతి గది రూపురేఖలు మార్చడంపై ప్రైవేట్‌ విద్యాసంస్థలు దృష్టి సారించాయి. ఒక్కో క్లాసుకు 15-20 మందిని భౌతిక దూరం పాటిస్తూ కూర్చోబెట్టడంతోపాటు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా డబుల్‌ మాస్క్‌తోపాటు ఫేస్‌షీల్డును ధ రించి స్కూల్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నా రు. ప్రతి బడిలో హెల్త్‌ చెకప్‌ రూమ్‌, ప్రవేశద్వారం వ ద్ద శానిటేషన్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌తోపాటు పిల్లలకు ప్ర త్యేకంగా గంటకోసారి హ్యాండ్‌ శానిటేషన్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.   


ఆలోచిస్తున్న విద్యాశాఖ..

కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్‌, టెక్నో స్కూళ్లు చేస్తున్న ఏర్పాట్లను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేపట్టే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏ ర్పాట్లను అమలు చేస్తూ పిల్లలకు బోధించడం కష్టమని, ఒకరిద్దరు పిల్లలు నిర్లక్ష్యంగా వ్యవహరించి కొవి డ్‌ బారిన పడితే.. వారి ద్వారా తరగతి మొత్తం వైరస్‌ ఉచ్చుకు చిక్కుకునే ప్రమాదముందని కొందరు అధికారులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది.


గట్టి ఏర్పాట్లు చేస్తే పంపిస్తా  

కరోనా మహమ్మారితో మా పిల్లల చదువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నా వారికి అర్థం కావడం లేదు. గతంలో చదివిన పాఠాలనూ మరిచిపోతున్నారు. ఈసారి పాఠశాలలో కరోనా ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తే పంపించాలని అనుకుంటున్నా. ఇంటి నుంచి పిల్లలకు డబుల్‌ మాస్కులు, ఫేస్‌షీల్డులు వేసి పంపిస్తా. క్లాస్‌రూమ్‌లో పది మంది కంటే ఎక్కువ కూర్చోకుండా చూడాలి. 

- శ్రీనివాస్‌, పేరెంట్‌, దుర్గానగర్‌, మల్కాజిగిరి


గతం కంటే మెరుగ్గా ఏర్పాట్లు   

కొవిడ్‌తో పాఠశాలలు మూతపడడంతో పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు బాగా తగ్గాయి. ఆన్‌లైన్‌ క్లాసుల కంటే ప్రత్యక్ష బోధనతోనే పఠనాసక్తి పెరుగుతోంది. ఫిబ్రవరిలో ప్రారంభించిన ఆఫ్‌లైన్‌ క్లాసుల సందర్భంగా మా స్కూల్‌లో గట్టి ఏర్పాట్లు చేశాం. ఈసారి పాఠశాలలు ప్రారంభమైతే ప్రతి క్లాసుకు 15 మందిని, బెంచీకి ఒక్కరినే కూర్చో బెట్టి పాఠాలు చెబుతాం. పిల్లల సంఖ్య ఎక్కువైతే ఉదయం, మధ్యాహ్నం వేళల్లో క్లాసులను విభజించి బోధిస్తాం. డబుల్‌ మాస్క్‌, ఫేస్‌షీల్డులను తప్పనిసరి చేస్తాం.  

- వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌, నారాయణ స్కూల్‌, తార్నాక

Updated Date - 2021-06-13T09:17:36+05:30 IST