గేటు ఎదుట గంటపాటు నిరీక్షించా!: మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

ABN , First Publish Date - 2021-11-18T14:47:29+05:30 IST

గేటు ముందు గంటసేపు వేచి..

గేటు ఎదుట గంటపాటు నిరీక్షించా!: మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

మంగళ్‌హాట్‌(ఆంధ్రజ్యోతి): చదువుకునే రోజుల్లో డిగ్రీలో ప్రవేశం కోసం తాను కోఠి ఉమెన్స్‌ కాలేజీ గేటు ముందు గంటసేపు వేచి ఉన్నానని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గుర్తుచేసుకున్నారు. నాడు తాను విద్యార్థిగా ఉండాల్సిన కాలేజీలో ఇవాళ అతిథిగా వచ్చి దర్బార్‌ హాల్లో ఫొటోలు దిగడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కోఠి మహిళా కళాశాలలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబిత హాజరై మాట్లాడారు. తాను చదువుకునే రోజుల్లో తొలుత రెడ్డి కాలేజ్‌లో సీటు రాలేదని.. కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌ ఎదుట గంటపాటు నిరీక్షించానని.. చివరికి వనితా కాలేజ్‌లో వచ్చిన సీటు పోతుందని వెంటనే అక్కడికి పరుగులు పెట్టి ఫీజు కట్టాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.


ఒక్కసారైనా కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌లోకి వెళ్లి చూడాలని ఉండేదని, అలాంటిది ఈ ప్రతిష్ఠాత్మకమైన కాలేజీలోకి వెళ్లే అదృష్టం, అవకాశం రావడం, దర్బార్‌ హాల్లో ఫొటోలు దిగడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలు సబ్జెక్ట్‌లలో ఉత్తమ ప్రతిభ కనబర్బిన 8 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. 



Updated Date - 2021-11-18T14:47:29+05:30 IST