ఏమిటీ దాగుడు మూతలు.. ముందే చెబితే నష్టమేంటి?

ABN , First Publish Date - 2021-04-29T17:54:54+05:30 IST

హైదరాబాద్: రేపటితో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ముగియనుంది. మరోవైపు కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

ఏమిటీ దాగుడు మూతలు.. ముందే చెబితే నష్టమేంటి?

హైదరాబాద్: రేపటితో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ముగియనుంది. మరోవైపు కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందనే దానిపై హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది. రేపటితో కర్ఫ్యూ ముగియనుంది.. తదుపరి చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని  ప్రభుత్వం వెల్లడించింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని ప్రశ్నించింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని మండిపడింది. నియంత్రణ చర్యలపై తామ ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదని హైకోర్టు తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నం లోగా తదుపరి తీసుకునే చర్యలేంటో చెబుతానని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.


భూమిపై నివసిస్తున్నారా.. ఆకాశంలోనా?

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారని నిలదీసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని ప్రశ్నించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం విరిగి మీద పడినా ఎన్నికలు జరగాలసిందేనా? అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ‘‘ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా? ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా.. ఆకాశంలోనా? కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా’’ అంటూ హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ తెలిపింది. ఫిబ్రవరిలోనే కరోనా రెండోదశ మొదలైనా.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు. నిలదీసింది. ఎన్నికలను వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా? అంటూ ఫైర్ అయింది. కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించ లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు ఫైర్ అయింది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదన్న హైకోర్టు.. కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-04-29T17:54:54+05:30 IST