గల్ఫ్లోని ప్రవాసీయులకు తెలుగు భాషాదినోత్సవ పురస్కారాలు
ABN , First Publish Date - 2021-09-01T02:27:22+05:30 IST
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికాలోని ప్రవాసీ తెలుగు సమాజం, నార్వేలోని ‘వీధి అరుగు’ అనే సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిథి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికాలోని ప్రవాసీ తెలుగు సమాజం, నార్వేలోని ‘వీధి అరుగు’ అనే సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలుగు పురస్కారాలు-2021 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. వివిధ దేశాలలోని తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన వారిని ఈ కార్యక్రమంలో సత్కరించింది. మొత్తం పన్నెండు మందిను ఎంపిక చేయగా అందులో గల్ఫ్ దేశాలు ఖతర్, కువైత్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, బహ్రెయిన్ ఒమాన్ దేశాలకు చెందిన ఆరుగురిని ఈ పురస్కారాన్ని అందజేశారు.
దుబాయిలో మా www.gulf.com అనే తెలుగు న్యూస్ పోర్టల్ నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీకాంత్కు ఈ పురస్కారం దక్కింది. దుబాయి నగరంలో వివిధ సంఘాలు లేదా వ్యక్తులు చేసే తెలుగు భాష కార్యక్రమాలకు తమ వంతుగా శ్రీకాంత్, అతని సతీమణి సౌమ్య ఇద్దరు తోడ్పాటందిస్తున్నారు. సామాజిక సేవలో కూడా ముందుండే శ్రీకాంత్ ఏపీ ఎన్నార్టీ కోర్డినేటర్గా కూడ పనిచేశారు.
అదే విధంగా, ఆబుదాబిలో నివశిస్తున్న ఆదిభట్ల కామేశ్వరశర్మకు కూడా ఆవార్డు దక్కింది. గత 12 ఏళ్ళుగా యూఏఈ రాజధానిలో బాలబాలికలకు తెలుగు భాషా బోధన తరగతులను ఆయన నిర్వహిస్తున్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద దత్తోధరణం అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఖతర్లోని తెలుగు ప్రవాసీయుల కోసం, తెలుగు భాష కోసం కృషి చేసిన ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి భాగవతులు వెంకప్పకు కూడా ఈ పురస్కారం దక్కింది. గత 16 సంవత్సరాలుగా ఖతర్లో ఉంటున్న వెంకప్ప.. వివిధ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
కువైత్లో పనిచేస్తున్న కడప జిల్లా సుండుపల్లి మండలానికి చెందిన షేక్ బాషా 2014 నుంచి కువైత్ ఆంధ్ర తెలుగు న్యూస్ పేరా ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తున్నారు. అందులో తనకు తోచిన విధంగా తెలుగు ప్రవాసీయులకు, తెలుగు భాషకు సేవలందిస్తున్నారు. ఒమాన్లో ప్రవీణ్ రాగి, బహ్రెయిన్లో పెంజర్ల జగదీశ్లకు కూడా ఇటీవలే తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఆవార్డులను ఆన్లైన్ వీక్షణ ద్వార ప్రధానం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో 2 రోజుల పాటు నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి యన్వీ రమణ, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆన్లైన్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.