‘టెస్టు’ పాస్
ABN , First Publish Date - 2020-12-12T10:08:08+05:30 IST
టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన ఖరారైంది. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన ఫిట్నెస్
ఫిట్నెస్ పరీక్ష నెగ్గిన రోహిత్
14న ఆసీస్కు పయనం
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన ఖరారైంది. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో శుక్రవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ పాసయ్యాడు. దీంతో అతడు ఈనెల 14న ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఐపీఎల్ సందర్భంగా రోహిత్ తొడ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఆసీస్ టూర్లో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి తప్పించి టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు. ‘రోహిత్ ఫిట్నెస్ పరీక్షలో పాసయ్యాడు. త్వరలోనే అతడు ఆస్ర్టేలియా వెళతాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపాడు. రోహిత్ ఆసీ్సకు వెళ్లిన తర్వాత అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. దీంతో అతడు చివరి రెండు టెస్టు (జనవరి 7-11, జనవరి 15-19)ల్లో మాత్రమే ఆడే అవకాశముంది.
అలా మొదలై...: ఐపీఎల్ సందర్భంగా గాయానికి గురైన రోహిత్.. అప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడలేదు. అదే సమయంలో ఆసీస్ టూర్కు ప్రకటించిన టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ అతడిని ఎంపిక చేయకపోవడంతో విమర్శలు వినిపించాయి. దీంతో టెస్టు సిరీస్కు రోహిత్ను ఎంపిక చేసిన మేనేజ్మెంట్.. టెస్టులకు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. అదే క్రమంలో ఐపీఎల్ ఆఖర్లో ముంబై తరఫున మ్యాచ్లు ఆడిన రోహిత్.. ఫైనల్లో తన జట్టును విజేతగా కూడా నిలిపాడు. ఐపీఎల్ ముగిశాక అతడు దుబాయ్ నుంచి టీమిండియాతో కలిసి ఆసీస్ వెళ్లకుండా నేరుగా భారత్ వచ్చాడు. ఈ క్రమంలో అతని గాయంపై కొంత గందరగోళం కూడా నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, బెంగళూరులోని ఎన్సీఏకు వెళ్లి ప్రాక్టీస్ చేసిన రోహిత్.. ఇప్పుడు ఫిట్నెస్ పరీక్ష పాసై ఆసీస్ టూర్కు సిద్ధమయ్యాడు.