విషాదం

ABN , First Publish Date - 2020-05-20T10:22:23+05:30 IST

వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.. అప్పటిదాకా కష్టపడి పొలానికి మందు పిచికారి చేశారు. పని పూర్తికావడంతో చేతులు శుభ్రం

విషాదం

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ముగ్గురు 

కంటి ముందే కుమారుడు, మనవళ్లు మృతి

భద్రాద్రి జిల్లా లక్ష్మీపురంలో ఘటన


బూర్గంపాడు, మే 19: వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.. అప్పటిదాకా కష్టపడి పొలానికి మందు పిచికారి చేశారు. పని పూర్తికావడంతో చేతులు శుభ్రం చేసుకునేందుకు చెరువు వద్దకు వెళ్లారు. కానీ మృత్యువు వారికోసం అక్కడ కాపుకాసిందని గుర్తించలేకపోయారు. చేతులు కడుక్కునే క్రమంలో ఒకరు ప్రమావశాత్తు నీటిలోకి జారిపోయారు. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు.. ఇలా నలుగురు నీట మునిగారు. వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో వ్యవసాయ పనులకు వెళ్లి ప్రమాదపుశాత్తు చెరువులో మునిగి ముగ్గురు(తండ్రి, కుమారుడు, మేనల్లుడు) మృతి చెందారు.


గ్రామానికి చెందిన నల్లమోతు కృష్ణయ్య, అతడి కుమారుడు అప్పారావు(40), అప్పారావు కుమారుడు తేజేష్‌(19), కృష్ణయ్య కూతురు ఉమ కుమారుడు జాగర్లమూడి వినయ్‌కుమార్‌(17) నలుగురు కలిసి పోలం వద్దకు వెళ్లారు. కూరగాయల పంటకు పురుగుల మందు పిచికారి చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో తేజేష్‌, వినయ్‌లు నీటిలో దిగగా ప్రమావశాత్తు లోతునీటిలోకి జారిపోయారు. ఇది గమనించిన అప్పారావు వారిని రక్షించే ప్రయత్నం చేయగా అతడూ నీటిలో మునిగిపోయాడు. గమనించిన కృష్ణయ్య వారిని రక్షంచేందుకు ప్రయత్నించగా అతడూ నీటిలో మునిగాడు.


ఈ సమయంలో అటుగా వెళుతున్న స్థానికులు కృష్ణయ్యను ఒడ్డుకు లాగారు. అనంతరం నీట మునిగిపోయిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కళ్లముందే కుమారుడు, మనవళ్లు జలసమాధి కావడంతో కృష్ణయ్య కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్‌ఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహలను కుటుంబసభ్యులకు అప్పగించారు.


లక్ష్మీపురంలో విషాదం.. 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో లక్ష్మీపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఐటీసీలో క్యాజువల్‌ లేబర్‌గా పనిచేస్తున్న అప్పారావుకి భార్య, కుమార్తె ఉన్నారు. అప్పారావు సోదరి ఉమను ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన జాగర్లమూడి శ్రీనివాసరావుతో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వినయ్‌కుమార్‌ పదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా పరీక్షలు వాయిదా పడడంతో లక్ష్మీపురం వచ్చాడు. మృతదేహలకు ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు తదితరులు నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  

 


Updated Date - 2020-05-20T10:22:23+05:30 IST