ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2020-08-03T02:47:04+05:30 IST
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కేంద్రం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఐపీఎల్ నిర్వహించేందుకు...
ముంబై: ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కేంద్రం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐకి కేంద్రం అనుమతినివ్వడంతో సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్13 నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ నిర్వహణకు కేంద్రాన్ని ఒప్పించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించారు. ఈ సంవత్సరాన్ని ఐపీఎల్ లేకుండా ముగించడం ఎంత మాత్రం ఇష్టం లేదని గతంలోనే దాదా స్పష్టం చేశారు. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లు రాత్రి 7.30కు మొదలుకానున్నాయి.
రెండు మ్యాచులున్న (డబుల్ హెడ్డర్స్) రోజుల్ని తగ్గించినట్లు గంగూలీ చెప్పినట్టుగానే కేవలం ఐదు రోజులే (సాయంత్రం 3.30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7.30కు మరో మ్యాచ్) రోజుకు రెండు మ్యాచులు చొప్పున జరగనున్నాయి. అయితే.. ప్రతీ ఐపీఎల్ సీజన్లో స్టేడియంలన్నీ ఇరు జట్ల ఫ్యాన్స్తో హోరెత్తేవి. కరోనా కారణంగా ఇప్పుడా పరిస్థితి లేదు. అయితే.. ఫ్యాన్స్ను అనుమతిస్తారా, లేదా అన్న విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.