సిరిమంతులు వలసెళ్లిపోతున్నారు..
ABN , First Publish Date - 2021-08-01T06:36:50+05:30 IST
భారత శ్రీమంతుల విదేశీ వలసలు జోరందుకున్నాయి. మరో దేశాన్ని రెండో నివాస, వ్యాపార ప్రాంతంగా మార్చుకునే మిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
- పెట్టుబడుల ద్వారా మరో దేశంలో పౌరసత్వం కోసం ప్రయత్నాలు
- అమెరికా, బ్రిటన్, ఐరోపా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్పై అమితాసక్తి
భారత శ్రీమంతుల విదేశీ వలసలు జోరందుకున్నాయి. మరో దేశాన్ని రెండో నివాస, వ్యాపార ప్రాంతంగా మార్చుకునే మిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్థిరపడాలనుకునే దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడి పౌరసత్వాన్ని పొందుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా, ఆస్ట్రేలియా, దుబాయ్తో పాటు ఐలాండ్స్లో సెటిల్ అయ్యేందుకు మనోళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఇందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఈ పథకం కింద భారతీయ వ్యక్తి ఏడాదిలో 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ.1.8 కోట్లు) వరకు విదేశాల్లో పెట్టుబడిగా పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
5,000: గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదిక ప్రకారం గత ఏడాదిలో విదేశాలకు వలస వెళ్లిన భారత మిలియనీర్లు. దేశంలోని మొత్తం మిలియనీర్లలో వీరి వాటా 2 శాతానికి సమానం.
1,500: పెట్టుబడుల ద్వారా ఇతర దేశాల్లో పౌరసత్వం పొందేందుకు గ్లోబల్ సిటిజన్షిప్, రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ను 2019లో సమాచారం కోరిన భారత శ్రీమంతుల సంఖ్య. 2020లో వీరి సంఖ్య 63 శాతం వృద్ధి చెందింది.
254: పెట్టుబడుల ద్వారా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో స్థిరపడాలనుకునే వారి కోసం 2008లో ప్రారంభించిన గోల్డెన్ వీసా పథకాన్ని ఇప్పటివరకు ఉపయోగించుకున్న ధనిక భారతీయులు.
23,000: అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2014 నుంచి అప్పటివరకు విదేశాల్లో స్థిరపడ్డ భారత శ్రీమంతుల సంఖ్య
వలసలకు కారణాలు
మెరుగైన పెట్టుబడి అవకాశాలు
సంపద సంరక్షణ, అభివృద్ధి
నాణ్యమైన విద్య, జీవనశైలి
మెరుగైన ఆరోగ్య సంరక్షణ
ఆధునిక మౌలిక సదుపాయాలు