రెండో రోజు.. రెండు సెషన్లు
ABN , First Publish Date - 2021-06-20T08:43:14+05:30 IST
వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప ఫైనల్కు రెండో రోజు కూడా ఆటంకం కలిగింది. శనివారం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
వెలుతురులేమితో ఆటంకం
భారత్ తొలి ఇన్నింగ్స్ 146/3
కివీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు రెండో రోజు కూడా ఆటంకం కలిగింది. శనివారం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చివరి సెషన్ ఆరంభం నుంచే వెలుతురులేమితో రెండుసార్లు అంతరాయం కలిగింది. దీంతో స్థాని క కాలమానం ప్రకారం సాయంత్రం 6.10 గంటలకు అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్తో 44 బ్యాటింగ్), రహానె (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్) ఉన్నారు. రోహిత్ (34), గిల్ (28) ఆకట్టుకున్నారు.
శుభారంభం:
వాతావరణం మబ్బులు పట్టి ఉండడంతో టాస్ గెలిచిన కివీస్ వెంటనే బౌలింగ్ తీసుకుంది. కానీ వీరి అంచనాలకు భిన్నంగా ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఓపెనింగ్కు దిగిన రోహిత్, గిల్ మొదటి వికెట్కు 62 పరుగులు అందించారు. ఎడమచేతి పేసర్ బౌల్ట్ ఇన్స్వింగర్లను రోహిత్ ఓపెన్ స్టాన్స్లో ఉండి ఆడగా మరోవైపు సౌథీ అవుట్ స్వింగర్లను గిల్ క్రీజు బయటకు వచ్చి ఎదుర్కొన్నాడు. అంతా సజావుగా సాగుతున్న వేళ పరుగు తేడాతో ఓపెనర్లు అవుటయ్యారు. 21వ ఓవర్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ను థర్డ్ స్లిప్లో ఉన్న సౌథీ పట్టేయగా.. గిల్ను వాగ్నర్ అవుట్ చేశాడు.
అతి జాగ్రత్త..: రెండో సెషన్లో కివీస్ సూపర్ స్వింగ్ బౌలింగ్కు భారత్ నుంచి అద్భుత డిఫెన్స్ ఎదురైంది. పుజార పరుగుల ఖాతా తెరిచేందుకు ఏకంగా 35 బంతులు తీసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదినా బౌల్ట్ ఇన్స్వింగర్కు ఎల్బీ అయ్యాడు. మరోవైపు కోహ్లీకి రహానె అం డగా నిలిచాడు. అయితే వెలుతురులేమితో 55.3 ఓవర్లోనే టీ విరామాన్ని ప్రకటించారు. ఆఖరి సెషన్ 15 నిమిషాల ఆలస్యంగా ఆరంభం కాగా ఆ తర్వాత మరో రెం డుసార్లు ఆటంకం కలగడంతో 9.1 ఓవర్ల ఆట మాత్రమే వీలైంది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌథీ (బి) జేమిసన్ 34; గిల్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 28; పుజార (ఎల్బీ) బౌల్ట్ 8; కోహ్లీ (బ్యాటింగ్) 44; రహానె (బ్యాటింగ్) 29; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: 64.4 ఓవర్లలో 146/3. వికెట్ల పతనం: 1-62, 2-63, 3-88. బౌలింగ్: సౌథీ 17-4-47-0; బౌల్ట్ 12.4-2-32-1; జేమిసన్ 14-9-14-1; గ్రాండ్హోమ్ 11-6-23-0; వాగ్నర్ 10-3-28-1
మిల్కా మృతికి నివాళి..
మిల్కా సింగ్ మృతికి టీమిండియా ఘనంగా నివాళి అర్పించింది. రెండో రోజు భారత బ్యాట్స్మెన్ నల్ల రిబ్బన్లు ధరించి ఆడారు.
భారత్ తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్ (61)లకు నేతృత్వం వహించిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో తను ధోనీని అధిగమించాడు. ఓవరాల్గా గ్రేమ్ స్మిత్ (101, దక్షిణాఫ్రికా) ముందున్నాడు.