వృక్షం మిగిల్చిన విషాదం

ABN , First Publish Date - 2022-01-19T04:47:01+05:30 IST

నగరంలోని బ్రాహ్మణబజార్‌లో మంగళవారంసాయంత్రం రావిచెటు,్ట శిథిల గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందడం, మరో ముగ్గురు గాయపడిన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

వృక్షం మిగిల్చిన విషాదం

ఖమ్మంక్రైం, జనవరి18: నగరంలోని బ్రాహ్మణబజార్‌లో మంగళవారంసాయంత్రం రావిచెటు,్ట శిథిల గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందడం, మరో ముగ్గురు గాయపడిన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్రికెట్‌ ఆడుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారులంతా శిథిలాల కింద నలిగి పోవడాన్ని చూసిన వారంతా చలించిపోయారు. అభంశుభం తెలియని పసిమొగ్గలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. అయితే చనిపోయిన దిగాంత్‌శెట్టి, రాజ్‌పుత్‌ ఆయుష్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెల విసేలా రోదిస్తున్నారు. అయితే నిన్నమొన్నటి వరకు ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోకి ఎవరూ వెళ్లేవారు కాదని, దాన్ని శుభ్రం చేయడంతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులపై ఇలా చెట్టు మృత్యువై విరిగిపడతుందని ఊహించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. 

ఒక్కడే కొడుకు.. మరో మూడు రోజుల్లో పుట్టినరోజు..

మృతి చెందిన వారిలో ఒకడైన మాల్వాడి దిగాంత్‌ శెట్టి (11) దినకరన్‌, షీలా దంపతులకు ఒక్కడే కుమారుడు. కర్ణాటకకు చెందిన దినకరన్‌ దంపతులు ఉపాధి కోసం ఖమ్మం నగరానికి వచ్చి ఓ హోటల్‌ క్యాషియర్‌గా పని చేస్తున్నారు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత సంతానం కలగ డంతో వారు కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకు ంటున్నారు. ఏడో తరగతి చదువుతున్న తన కుమారుడి పుట్టిన రోజుకు మరో మూడు రోజుల్లో ఉందని, చిన్నారి పుట్టిన రోజును ఘనంగా చేసేందుకు షాపింగ్‌, ఇతర పనులు చేసుకుంటున్నామని, ఇంతలోనే తమ కుమారుడు మృతి చెందాడని తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. 

అన్న బయట.. తమ్ముడు శిథిలాల్లో 

రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్‌, కళావతి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ప్రకాష్‌ ఆప్టికల్‌ షాపు నడుపుతూ కొన్నేళ్లుగా ఖమ్మంలో ఉంటున్నారు. అయితే వారి ఇద్దరు కుమారులైన 11ఏళ్ల అనుమోలు, రాజ్‌పుత్‌ ఆయుష్‌(5) రోజూ కలిసే ఆడుకుంటారు. మంగళవారం కూడా ఇద్దరూ కలిసే ఆటకు వెళ్లారు. ఈ క్రమంలో చెట్టు కూలగా.. గాయాలతో శిథిలాల నుంచి బయటకొచ్చిన అనుమోలు తన తమ్ముడు ఆయుష్‌ చెట్టు కింద ఉన్నా డంటూ పెద్దపెద్దగా ఏడుస్తూ కేకలు వేశాడు. శిథిలాలను తొలగిస్తున్న సమయంలో అనుమోలు తన తమ్ముడిని ప్రాణాలతో చూసేందుకు పడిన తాపత్రయం అందరినీ కంటతడి పెట్టించింది. అయితే ఆటలాడు కోవడానికి వెళ్లిన ఇద్దరు కుమారుల్లో ఒకరు కన్ను మూయడంతో ప్రకాష్‌, కళావతి దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 


Updated Date - 2022-01-19T04:47:01+05:30 IST