మణికొండ మున్సిపాలిటీ ప్రత్యేకత ఇదే
ABN , First Publish Date - 2020-09-19T01:38:39+05:30 IST
మణికొండ మున్సిపాలిటీ ప్రత్యేకత ఇదే
హైదరాబాద్: కష్టపడితే ఏదైనా సాధించవచ్చని మణికొండ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది నిరూపించారు. మున్సిపాలిటీకి ఇప్పటికే అనేక పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తూ రాష్ట్రంలో మణికొండ మున్సిపాలిటీ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది.
కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలలో ఓడిఎఫ్+ బహిరంగ మలమూత్ర రహిత మున్సిపాలిటీగా ఎన్నికైంది. వాణిజ్య అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. వీటిలో మహిళల కోసం షీ-టాయిలెట్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జయంత్ తెలిపారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బందికి సదుపాయాలతో కూడిన టాయిలెట్ నిర్మించారు.
ప్రోటోకాల్లో సూచించిన విధంగా పారిశుధ్యానికి సంబంధించి అన్ని నియమనిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో మున్సిపల్ చైర్పర్సన్ కస్తూరి నరేందర్ నిరంతరం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్తోపాటు పాలకవర్గం చేస్తున్న కృషికి మున్సిపాలిటీకి అనేక అవార్డులు వస్తున్నాయి.