ఈ వేసవి.. చాలా హాట్ గురూ!
ABN , First Publish Date - 2021-03-02T09:14:25+05:30 IST
సుమారు ఇరవై ఏళ్ల తరువాత ఈ ఏడాది శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యాయి. ఫిబ్రవరి మూడో వారం వరకు చలి వాతావరణం కొనసాగింది.
కోస్తాలో పెరగనున్న ఎండలు
సాధారణం కంటే 0.22 డిగ్రీలు ఎక్కువ
సీమలో 0.33 డిగ్రీలు తక్కువ.. మే వరకూ వడగాడ్పులు
భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సుమారు ఇరవై ఏళ్ల తరువాత ఈ ఏడాది శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యాయి. ఫిబ్రవరి మూడో వారం వరకు చలి వాతావరణం కొనసాగింది. అయితే చలి తగ్గుతున్న సమయంలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. తూర్పు తీరంలోని భువనేశ్వర్లో మూడు రోజుల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మార్చి నుంచి మే నెల వరకు దేశంలో ఎండల తీవ్రత, వేసవి వాతావరణంపై సోమవారం భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ ఏడాది దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, రాయలసీమ తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల వరకు కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.22 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని, అదే రాయలసీమలో సాధారణం కంటే 0.33 డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయని తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ నిపుణుడు ఆచార్య ఓఎ్సఆర్యూ భానుకుమార్ తెలిపారు. కరోనా లాక్డౌన్తో గత ఏడాది మార్చి నుంచి మే వరకు కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ తగ్గాయని, అయితే ప్రస్తుతం అటువంటిదేమీ లేనందున యథావిధిగా సీవోటీ పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల వాతావరణం వేడిగా మారిందన్నారు. ఇక, శివరాత్రికి ముందే.. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. అప్పుడే వేసవి వచ్చినట్లుంటోంది. ప్రస్తుతానికి కోస్తాంధ్రలో సాధారణ స్థాయి ఎండలు ఉంటున్నా, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా సీమ ప్రాంతంలో 2-3డిగ్రీలు ఎండ ఎక్కువగానే ఉంటోంది.