పొల్లాచ్చి కేసులో అన్నాడీఎంకే ప్రముఖుడు సహా ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-01-07T17:18:34+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పొల్లాచ్చి

పొల్లాచ్చి కేసులో అన్నాడీఎంకే ప్రముఖుడు సహా ముగ్గురి అరెస్టు

చెన్నై : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పొల్లాచ్చి అత్యాచారాల కేసులో తాజాగా అన్నాడీఎంకే ప్రముఖుడి సహా ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు సమీపం పొల్లాచ్చి వద్ద కాలేజీ విద్యార్థినులను ప్రేమ పేరుతో వంచించి కొందరు యువకులు శివారు ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లో సామూహిక అత్యాచారాలకు పాల్పడి, వారిని  సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి బెదరింపులకు పాల్పడ్డారు. ఈ అత్యాచారాల కేసులో పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు (25), శబరి రాజన్‌ (25), వసంత్‌కుమార్‌ (27) సతీష్‌ (28), మణివన్నన్‌ (25) అనే వారిని 2019లో సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అత్యాచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలి సోదరుడిపై దాడికి పాల్పడిన నేరానికి ‘బార్‌’ నాగరాజ్‌ సహా మరి ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు కేసులపై సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ విచారణ నత్తనడకన సాగుతుండటంతో రెండు కేసులను గతేడాది ఏప్రిల్‌లో సీబీఐకి బదిలీ చేశారు. సీబీఐ ఐజీ, అడిషనల్‌ ఎస్పీ సహా సీబీఐ అధికారులు అత్యాచారాలు జరిగిన ప్రాంతాల్లో దర్యాప్తు జరిపిన మీదట తాజాగా కేసులు నమోదు చేసి ఐదుగురిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ కేసులకు సంబంధించి ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ అత్మాచారాల సంఘటనలతో మరికొందరికి సంబంఽధాలుం డవచ్చని సీబీఐ అధికారులు భావించారు. ఆ దిశగా వారు దర్యాప్తు ముమ్మరం చేశారు.


20 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ

ఇదిలా వుండగా అత్యాచారాల కేసులో అరెస్టయిన ముగ్గురిలో అరుళానందం పొల్లాచ్చి నగర అన్నాడీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శిగా ఉంటూ పాత కార్ల వ్యాపారం చేస్తున్నాడు. అరుళానందం రాష్ట్రమంత్రి ఎస్పీ వేలుమణి, డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారంటూ వారితో అరుళానందం తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన అరుళానందం వివాహవేడుకల్లో రాష్ట్రమంత్రి సహా  పలువురు  అన్నాడీఎంకే ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో  కలకలం రేపుతున్నాయి. ఇక ‘బైక్‌’ బాబు ద్విచక్రవాహనాల వ్యాపారం చేస్తున్నాడు. అరెస్టయిన ముగ్గురిని సీబీఐ అధికారులు మరోసారి విచారణ జరిపిన తర్వాత బుధవారం ఉదయం కోయం బత్తూరు మహిళాకోర్టులో వారిని హాజరుపరిచారు. ఆ ముగ్గురిని ఈనెల 20 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వారిని జైలుకు తరలించారు.


ముగ్గురి అరెస్టు

ఈ పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం పొల్లాచ్చి ఆచ్చిపట్టి సమీపం సంగమ్‌పాళయంకు చెందిన హేరేన్‌ పాల్‌ (29), పొల్లాచ్చి వడుకమ్‌ పాళయం వీకేవీ లే అవుట్‌ ప్రాంతానికి చెందిన బాబు అలియాస్‌ ‘బైక్‌’ బాబు (27) పొల్లాచ్చి వడుక్కమ్‌ పాళయానికి చెందిన అరుళానందం (34) అనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ విచారణలో యువతులపై జరిగిన అత్యా చారాల కేసులతో ఆ ముగ్గురికి సంబంధాలున్నట్టు వెల్లడైంది. దీంతో మంగళవారం అర్థరాత్రి ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.


పార్టీ నుంచి అరుళానందం తొలగింపు

పొల్లాచ్చి అత్యాచారాల కేసులలో అరెస్టయిన అరుళా నందంను పార్టీ నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే అధిష్ఠానం ఓ ప్రకటన విడుదల చేసింది. అరుళానందాన్ని మంగళవారం అర్ధరాత్రి సీబీఐ అరెస్టు చేసినట్టు వార్త రాగానే అన్నాడీఎంకే అధిష్ఠానం ఆయనను పొల్లాచ్చి అన్నాడీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. అరుళానందంతో పార్టీకి చెందినవారెవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2021-01-07T17:18:34+05:30 IST