‘టిక్టాక్’ లాంటి లాభాలు గడించడమే అసలు సవాలు: నందన్ నీలేకని
ABN , First Publish Date - 2020-07-05T17:12:12+05:30 IST
ప్రస్తుతం భారత్కు టిక్టాక్ లాంటి చైనా యాప్ల పీడ వదిలిపోయింది. దీంతో అటువంటి యాప్లను భారత్లోనే తయారు చేయాలనే ఆలోచనకు మద్దతు పెరుగుతోంది. తాజాగా దీనిపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పందించారు.
బెంగళూరు: ప్రస్తుతం భారత్కు టిక్టాక్ లాంటి చైనా యాప్ల పీడ వదిలిపోయింది. దీంతో అటువంటి యాప్లను భారత్లోనే తయారు చేయాలనే ఆలోచనకు మద్దతు పెరుగుతోంది. తాజాగా దీనిపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పందించారు. టిక్టాక్ లాంటి యాప్లు భారత్లో తయారు చేయడం తేలికేనని, వాటి ద్వారా లాభదాయక వ్యాపారం నెలకొల్పడమే అతిపెద్ద సవాలని ఆయన వ్యాఖ్యానించారు.
‘మనం కూడా టిక్టాక్లను తయారు చేసుకోగలం. అయితే ఇక్కడ మనకు ఎదురవుతున్న సవాలు కొంచెం సంక్లిష్టమైనది. అసలు ఈ వ్యాపారం వెనకున్న బిజినెస్ మోడల్స్ను ముందుగా అర్థం చేసుకోవాలి. ఫేస్బుక్, గూగుల్ లాగా టిక్టాక్కూ ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలే. గత ఏడాది టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ 17 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. తద్వారా 3 బిలియన్ డాలర్ల లాభాన్ని పొందింది. ఇందులో అధికభాగం చైనా, అమెరికా నుంచి వచ్చిందే’
‘అయితే భారత్లో డిజిటల్ యాడ్ల మార్కెట్ చైనా, అమెరికా అంతటి స్థాయిలో లేదు. భారత టీవీ, ప్రింట్, డిజిటల్ వేదికల్లో వచ్చే మొత్తం ప్రకటనల విలువ 12 బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చు. ఇందులో డిజిటల్ వేదికల్లోని యాడ్ల వాటా 3 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. అంటే.. టిక్ టాక్ లాంటి ఉత్పత్తులు మన దేశంలో ఎక్కువగా లాభాలను ఆర్జించడం లేదని అర్థం. కేవలం వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే వ్యూహాత్మక లక్ష్యంతోనే ఆయా సంస్థలు ఇక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి’ అని నందన్ నీలేకని చెప్పారు. ప్రస్తుతానికి భారత్లో వినియోగదారులను పెంచుకుని భవిష్యత్తులో లాభాలను గడించడమే బైట్డ్యాన్స్ లాంటి సంస్థల వ్యూహమని ఆయన తెలిపారు.