నకిలీ హాల్టికెట్తో యూపీఎస్సీ మెయిన్స్కు
ABN , First Publish Date - 2021-01-09T08:06:42+05:30 IST
కుటుంబసభ్యులను సంతృప్తి పరిచేందుకు ఓ యువతి ఆడిన అబద్ధం, చివరికి ఆమెకే సమస్యను తెచ్చిపెట్టింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అర్హత సాధించకున్నా సాధించినట్లు అబద్ధమాడిన ఆమె, మెయిన్స్కు
ఓ యువతి నిర్వాకం.. కేసు నమోదు
మంగళ్హాట్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కుటుంబసభ్యులను సంతృప్తి పరిచేందుకు ఓ యువతి ఆడిన అబద్ధం, చివరికి ఆమెకే సమస్యను తెచ్చిపెట్టింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అర్హత సాధించకున్నా సాధించినట్లు అబద్ధమాడిన ఆమె, మెయిన్స్కు హాజరయ్యేదాకా దాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో నకిలీ హాల్టికెట్తో పరీక్ష కేంద్రం వద్ద నిర్వాహకులకు అడ్డంగా దొరికిపోయింది. శుక్రవారం నాంపల్లిలోని పరీక్ష కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. హబీబ్నగర్ ఎస్సై జయంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన యువతి(23) గత కొంత కాలంగా యూపీఎస్సీ పరీక్షల నిమిత్తం శిక్షణ తీసుకుంటోంది. గత ఏడాది అక్టోబరులో జరిగిన ప్రిలిమ్స్ రాసిన ఆమె మెయిన్స్కు అర్హత సాధించలేకపోయింది. కానీ, మెయిన్స్కు అర్హత సాధించినట్లు ఇంట్లో చెప్పడంతో వారు ఎంతో సంతోషపడి ఆమెకు ఢిల్లీలో కోచింగ్ ఇప్పించారు. యూపిఎస్సీ మెయిన్స్ పరీక్షలు పరీక్షలు మొదలైన తర్వాత ఎలా హాజరు కావాలో తెలియక ఆందోళనకు గురైన యువతి, పలు వెబ్సైట్లలో హాల్ టికెట్లను పరిశీలించింది. ఓ వెబ్సైట్లోని హాల్టికెట్ ఆధారంగా తన పేరుతో నకిలీ హాల్టికెట్ ను సిద్ధం చేసుకుంది.
ఆ హాల్ టికెట్తో పరీక్ష రాసేందుకు కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లిలోని బాయ్స్ జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సెంటర్కు వచ్చింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేందుకు గేటు వద్ద హాల్ టికెట్ను అధికారులకు చూపించగా అది ఫేక్ అని గుర్తించారు. వెంటనే నాంపల్లి ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో, కాలేజ్ ప్రిన్సిపాల్లకు సమాచారమిచ్చారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి దృష్టికి తీసుకువెళ్లారు. తదనంతరం హబీబ్నగర్ పోలీసులకు యువతిని అప్పగించారు. అధికారుల ఆదేశాల మేరకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.