పుట్టింటికి రా..వద్దు సోదరీ..!
ABN , First Publish Date - 2020-08-03T10:21:15+05:30 IST
అన్నా, చెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వస్తుందంటే చాలు నెలరోజుల ముందు నుంచే రాఖీపూల విక్రయాలు జోరుగా
‘కరోనా’తో కళ తప్పిన రక్షాబంధన్
అంతా ‘ఆన్లైన్’లోనే అంటూ సందేశాలు
నేడు రాఖీ పండుగ
ఖమ్మం సాంస్కృతికం, ఆగస్టు 2: అన్నా, చెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వస్తుందంటే చాలు నెలరోజుల ముందు నుంచే రాఖీపూల విక్రయాలు జోరుగా సాగేవి. దూరప్రాంతాలలో ఉండే అక్కలు, చెళ్లెల్లు తమ సోదరుల వద్దకు వెళ్లడానికి ముందుగానే ప్రణాళికలు వేసుకునేవారు. రైళ్లు, బస్సుల్లో ఆన్లైన్ రిజర్వేషన్ల బుకింగ్తో హడావుడి చేసేవారు. కానీ ఈ సారి కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఆ సందడి అంతా పోయింది. రక్షాబంధన్ కళ తప్పింది. అనుబంధాల పండుగ రోజున బిక్కుబిక్కుమంటూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్టినింట ఉన్న సోదరీమణులను ‘మీరు పుట్టింటికి రావద్దు. అంతా క్షేమంగా ఉంటే వచ్చే ఏడాది రాఖీకి కలుసుకుందాం. ఈ ఏడాదికి వీడియో కాల్, స్కైప్లో శుభాకాంక్షలు చెప్పుకొని ఆనందపడదాం. అందరం ఇళ్లలో సంతోషంగా ఉందాం’ అంటూ సోదరులు కోరుతున్నారు. ఇదంతా ఒకింత బాధకలిగించే అంశమే అయినా.. మహమ్మారి కరోనా బారిన పడకుండా ఉంటే చాలు అని చెబుతున్నారు.
సోమవారం జరుపుకొనే అనుంబంధాల రాఖీ పండుగను ఎక్కడి వారు అక్కడే జరుపుకోవడమే క్షేమమన్న సందేశాన్ని పంపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రతీ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పూలు, స్వీట్లు, గిఫ్ట్లు ఇలా రూ.లక్షల్లో వ్యాపారం నడిచేది. కానీ కరోనా లాక్డౌన్ నిబంధనలతో ఈ సంవత్సరం జోరుగా వ్యాపారం నడిచే వీధులు కట్టడి ప్రాంతాల పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఆ ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేసేందుకు జనం సాహసించడం లేదు.