నేడు సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-24T10:43:19+05:30 IST

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు శనివారంతో సద్దుల బతుకమ్మ ముగియనున్నాయి.

నేడు సద్దుల బతుకమ్మ

పూలతో కళకళలాడిన మార్కెట్లు 

కొవిడ్‌ నిబంధనలతో నిమజ్జనానికి ఏర్పాట్లు


కొత్తగూడెం సాంస్కృతికం/ ఖమ్మం సాంస్కృతికం,  అక్టోబరు 23: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు శనివారంతో సద్దుల బతుకమ్మ ముగియనున్నాయి. పల్లె, పట్టణాలంతా బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రకృతిలోని తీరొక్క పూలను విక్రయదార్లు అమ్మేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉంచారు. ఖమ్మం జిల్లాలోని మధర, సత్తుపల్లి, ఖమ్మం, తల్లాడ, భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పూలతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. బతుకమ్మను తీర్చిదిద్దేందుకు తంగేడు, లిల్లీ, కట్ల, చామంతి, కలువ, బంతి, గుమ్మడి, పూల విక్రయదారులతో రోడ్లన్నీ సప్తవర్ణ శోభితంగా మారాయి. ఆఖరి అంకానికి చేరిన సద్దుల బతుకమ్మ వేడుకను కొత్తగూడెంలోని ముర్రేడువాగు ఘాట్‌, రుద్రంపూర్‌ ప్రగతివనం చెరువు, రామవరం గోదుమవాగు, సుజాతనగర్‌ నాయకులగూడెం చెరువు, ఖమ్మంలోని మున్నేరు నది వాగు ప్రాంతాలోల మహిళలు బతుకమ్మలను ఉంచి ఆట, పాటలతో సంబరాలు జరుపుకోనున్నారు.


ఇందుకోసం ఆయా ఘాట్‌ల వద్ద నిర్వాహకులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.  గ్రామాల్లోని సంబంధిత అధికారులు శానిటైజేషన్‌ సిబ్బంది ఘాట్ల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. బతుకమ్మ సందర్భంగా పూల గిరాకీ సైతం పెరిగింది. సాధారణ రోజులతో పోల్చుకుంటే పూల ధరలు అమాంతం పెరిగాయి. తంగేడు పూలను తెచ్చేందుకు యువకులు అడవి బాట పట్టారు. దూర ప్రాంతాల్లోని మహిళలు, ఆడ పడుచులు తమ సొంత ఊళ్లకు చేరుకోవడంతో ఆయా కుటుంబాల్లో ఇప్పటికే బతుకమ్మ సందడి నెలకొంది. తెలంగాణాలో అతిపెద్ద పండగగా భావించే దసరా పండగ సందర్భంగా షాపింగ్‌ కూడళ్లన్ని వినియోగదార్లతో కళకళలాడుతున్నాయి. 

Updated Date - 2020-10-24T10:43:19+05:30 IST