మందకృష్ణకు రేవంత్ పరామర్శ.. ఎస్సీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-29T23:05:55+05:30 IST

మందకృష్ణకు రేవంత్ పరామర్శ.. ఎస్సీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు

మందకృష్ణకు రేవంత్ పరామర్శ.. ఎస్సీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం మాదిగలు చాలా పోరాటాలు చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇటీవల మందకృష్ణ మాదిగ కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మందకృష్ణ నివాసానికి వెళ్లారు. మందకృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక ఏమైన మాదిగల జీవితాలు మారాయా అని మందకృష్ణను తాను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. 


తెలంగాణ ఎంత కీలకమైందో.. ఎస్సీ వర్గీకరణ కూడా అంతే కీలకమైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వర్గీకరణకు అనుకూలంగా గతంలోనే తాను అసెంబ్లీ‌లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘25 ఏళ్లుగా కృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ఎందుకు వర్గీకరణపై కేంద్రాన్ని నిలదీయడం లేదు. కృష్ణ మాదిగ పనై పోయిందన్న వాళ్లు ఎందుకు పని చేయడం లేదు. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి గతంలో మాదిగలకు వర్గీకరణ‌పై హామీ ఇచ్చారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై బిల్లు పెడితే  మేము మద్దతిస్తాం. మాదిగ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దళిత బంధు లాంటి పథకాలు కాదు వర్గీకరణ కావాలి. దళిత బిడ్డలు, ఎమ్మార్పీఎస్ నేతలు హుజూరాబాద్‌లో పర్యటించి టీఆర్ఎస్‌ను నిలదీయాలి.’’ అని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.  

Updated Date - 2021-09-29T23:05:55+05:30 IST