దొడ్డిదారిన టీటీడీలోకి!

ABN , First Publish Date - 2021-10-27T08:21:48+05:30 IST

దొడ్డిదారిన టీటీడీలోకి!

దొడ్డిదారిన టీటీడీలోకి!

ప్రత్యేక ఆహ్వానితుల కోసం చట్ట సవరణ?

జీవోలను హైకోర్టు నిలిపివేయడంతో నిర్ణయం 

జైనులు, సిక్కులకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు 

రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించే చాన్స్‌ 


అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించిన జీవోను హైకోర్టు నిలిపివేయడంతో... దీనికి చట్ట సవరణ రూపంలో మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు 52మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ సెప్టెంబరులో జీవో నం.568, 569 జారీ చేసింది. అయితే దేవదాయ చట్టం-1987, ఇతర చట్టాల ప్రకారం టీటీడీ బోర్డుకు ఛైర్మన్‌, 29మందికి మించని సభ్యులను మాత్రమే నియమించాలని, ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి అవకాశం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆ జీవోల అమలును నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తాము చేసిన నియామకాలకు అడ్డులేకుండా ఉండటానికి చట్టంలో సంబంధిత సెక్షన్లకు సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆహ్వానితులను కూడా టీటీడీ బోర్డు సమావేశాలకు ఆహ్వానించే అవకాశం కల్పించడం, నియామకాలకు అవకాశం ఇచ్చేలా సవరణ చేయనున్నారని తెలిసింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి మార్గం సుగమం చేసుకోవచ్చని భావిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన 28న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మరోవైపు రాష్ట్రంలోని సిక్కులు, జైనుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 

Updated Date - 2021-10-27T08:21:48+05:30 IST