‘పరువు’ కేసులో వెనకడుగు!

ABN , First Publish Date - 2020-10-21T08:41:49+05:30 IST

తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై వేసిన పరువునష్టం కేసు ఉపసంహరణకు టీటీడీ

‘పరువు’ కేసులో వెనకడుగు!

విజయసాయి, రమణదీక్షితులుపై టీటీడీ ఉపసంహరణ పిటిషన్‌


(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై వేసిన పరువునష్టం కేసు ఉపసంహరణకు టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు పాలకమండలిలో తీర్మానం కూడా చేసింది. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంతో పాటు ఏకంగా కోర్టులో విత్‌డ్రా పిటిషన్‌ దాఖలు చేసింది. తిరుపతి 10వ అదనపు జిల్లా కోర్టులో నడుస్తున్న ఈ కేసులో తమను కూడా ఇంప్లీడ్‌ చేయాలంటూ తెలంగాణకు చెందిన హిందు జనశక్తి సంస్థ కోరడంతో ఈ విషయం బహిర్గతమైంది. రూ.200 కోట్ల పరువునష్టం కేసులో చెల్లించిన కోర్టు ఫీజు రూ.2కోట్లు వదులుకోవడానికి కూడా టీటీడీ సిద్ధమైంది. ‘వేంకటేశ్వరస్వామి హుండీలో డబ్బులు వేయకండి’, ‘పింక్‌ డైమండ్‌ను విదేశాల్లో వేలం వేశారు’ అంటూ రమణదీక్షితులు చెన్నై, ఢిల్లీల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. వీటిని సమర్థిస్తూ విజయసాయిరెడ్డి కూడా అనేక ఆరోపణలు చేశారు. దాంతో వీరిద్దరూ రూ.వంద కోట్లు చొప్పున చెల్లించాలని టీటీడీ పిటిషన్‌ వేసింది.


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై టీటీడీ వైఖరి మారిపోయింది. 2020 ఫిబ్రవరి 29న పాలకమండలి భేటీలో ఆ కేసుపై 447వ నంబరుతో ఒక తీర్మానం చేశారు. విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు శ్రీవారిపై తమకు నమ్మకం ఉందని ప్రకటించినందున ఆ కేసును విత్‌డ్రా చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఈ అంశంపై తెలంగాణకు చెందిన హిందు జనశక్తి సంస్థ, తిరుపతికి చెందిన లాయర్‌ ఆదినారాయణ ద్వారా ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడంతో టీటీడీ తీసుకున్న ఉపసంహరణ నిర్ణయం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2020-10-21T08:41:49+05:30 IST