బీజేపీది మండ్రగబ్బ పాత్ర.. వైసీపీది తేలు పాత్ర: తులసీరెడ్డి
ABN , First Publish Date - 2021-04-08T19:27:26+05:30 IST
బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.
అమరావతి: బీజేపీది మండ్రగబ్బ పాత్ర అని, వైసీపీది తేలు పాత్ర అని కుట్టడం, వడ్డించడం, వాయించడం, వేధించడం, బాధించడం మండ్రగబ్బ, తేలు లక్షణమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ధరలు పెంచడం, వడ్డించడం, వేధించడం బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల లక్షణమని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి సమీపంలో ఉన్నాయన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో ఇసుక, సిమెంట్, మద్యం, నూనెలు పప్పుధాన్యాల ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెరిగాయన్నారు. మండ్రగబ్బ, తేలు కనబడితే చంపుతాం.. అలాగే బీజేపీ, వైసీపీ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని, ఆ ఓటమి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికతోనే ప్రారంభం కావాలని తులసీ రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు.