జంపన్నవాగులో మునిగి అక్క, తమ్ముడి మృతి
ABN , First Publish Date - 2021-01-17T04:45:28+05:30 IST
జంపన్నవాగులో మునిగి అక్క, తమ్ముడి మృతి
మేడారం, జనవరి 16 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగులో నీట మునిగి అక్కాతమ్ముడు మృతి చెందారు. మేడారం పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన మెండు సంపత్రెడ్డి-అనిత దంపతులకు కుమార్తె జాహ్నవి (12), కొడుకు హేమంత్ (09) ఉన్నారు. అనిత సోదరి సునీత సమ్మక్క-సారలమ్మల మొక్కు తీర్చుకునేందుకు శనివారం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి మేడారానికి రాగా చిన్నారులిద్దరూ వాళ్లతో కలిసి ఆలయ ప్రాంగణానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం అందరూ జంపన్నవాగు ఒడ్డున సేద తీరారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల సమయంలో వాగులో ఆడుకుంటున్న చిన్నారులిద్దరూ నీటి లోతులోకి వెళ్లి మునిగిపోయారు. తల్లిదండ్రులు, బంధువులు చూస్తుండగానే నీటిలో మునిగిపోతుండగా వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడం స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కళ్లెదుటే కన్నబిడ్డలిద్దరూ మరణించడంతో అనిత-సంపత్రెడ్డి దంపతులు గుండెలవిసేలా రోదించారు.