యూఎస్లో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి !
ABN , First Publish Date - 2020-09-19T22:43:24+05:30 IST
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్లోని రోచెస్టర్ నగరంలో శనివారం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రోచెస్టర్లో జరిగిన ఓ బ్యాక్యార్డ్ పార్టీలో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో 18 ఏళ్ల యువకుడు, 22 ఏళ్ల యువతి ఉన్నట్లు రోచెస్టర్ పోలీస్ చీఫ్ మార్క్ సిమ్మన్స్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, మార్చిలో డానియల్ ప్రూడ్ అనే నల్లజాతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో అమానుషంగా వ్యవహరించిన వీడియోను అతని కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 4న బయటపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం డానియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత చనిపోయాడు. ఈ ఘటనకు నిరసనగా ఇటీవల రోచెస్టర్లో భారీగా ఆందోళనలు జరిగాయి. దీంతో ఈ ఘటనతో తాజాగా జరిగిన కాల్పులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పార్టీలో కాల్పులు జరిగిన అనంతరం వంద మంది వరకు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లు మార్క్ సిమ్మన్స్ చెప్పారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ఈ పార్టీకి ఇంతమంది ఎలా వచ్చారనే విషమయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు సిమ్మన్స్ తెలిపారు.