యూఏఈలో ఆగని కోవిడ్ ఉధృతి !
ABN , First Publish Date - 2020-05-28T14:46:13+05:30 IST
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు గల్ఫ్లో కూడా విజృంభిస్తోంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్లో ఈ వైరస్ విరుచుకుపడుతోంది.
యూఏఈ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు గల్ఫ్లో కూడా విజృంభిస్తోంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్లో ఈ వైరస్ విరుచుకుపడుతోంది. యూఏఈలో కోవిడ్-19 రోజురోజుకీ శరవేగంగా ప్రబలుతోంది. దీంతో ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కూడా యూఏఈలో 883 కొత్త కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి ఉధృతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఇక నిన్న నమోదైన కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకూ ఆ దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 31,969కి చేరింది. అలాగే 389 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 16,371 మంది కోలుకున్నారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, బుధవారం ఇద్దరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు యూఏఈలో ఈ మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 255 అయింది. ఇక కరోనా కట్టడి కోసం ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతున్న యూఏఈ దేశవ్యాప్తంగా కోవిడ్ టెస్టులను ముమ్మరం చేసింది. నిన్న 27,000 కరోనా టెస్టులు నిర్వహించిన యూఏఈ... దేశవ్యాప్తంగా ఇప్పటికే 2 మిలియన్కు పైగా మందికి కరోనా పరీక్షలు చేసింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ ప్రతినిధి డా. అమ్నా అల్ దహక్ అల్ షంసీ మాట్లాడుతూ... ఇటీవల పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్యకు కారణం ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయడమేనని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలు పెరగడం వల్ల వైరస్ సంక్రమణ వేగంగా జరిగి కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కనుక జనాలు సాధ్యమైనంత వరకు సామాజిక దూరం పాటించడంతో పాటు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.