భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ నిషేధం

ABN , First Publish Date - 2021-04-20T11:03:44+05:30 IST

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఇండియా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్‌ 11 నుంచి 28 దాకా భారత్‌ నుంచి ప్రయాణికుల రాకపై న్యూజిలాండ్‌ నిషేధం విధించింది. మనదేశాన్ని రెడ్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు యూకే ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా..

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ నిషేధం

లండన్: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఇండియా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్‌ 11 నుంచి 28 దాకా భారత్‌ నుంచి ప్రయాణికుల రాకపై న్యూజిలాండ్‌ నిషేధం విధించింది. మనదేశాన్ని రెడ్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు యూకే ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా గత 10 రోజుల్లో భారతదేశంలో ఉండి ఉంటే, వారికి బ్రిటన్‌లో ప్రవేశం నిషిద్ధం. భారత్‌ నుంచి వచ్చే బ్రిటిష్‌, ఐరిష్‌ పౌరులను మాత్రం అనుమతిస్తారు. అయితే, వారు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో 10 రోజులపాటు ఉండాలి. ఈ రెడ్‌లిస్ట్‌లో భారత్‌తో కలిపి 40 దేశాలు ఉన్నాయి. హాంకాంగ్‌ కూడా మంగళవారం(ఏప్రిల్‌ 20) నుంచి మే 3 దాకా భారత్‌ నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధించింది. పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ ప్రయాణికులపైనా నిషేధం విధించింది.


ఇప్పటికే ఈ దేశాల నుంచి హాంకాంగ్‌కు వచ్చి, పాజిటివ్‌గా తేలి, క్వారంటైన్‌లో ఉన్నవారు పాజిటివ్‌గా తేలిన నాటి నుంచి 26వ రోజున తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. మరోవైపు.. కేసులు ఆందోళనకరంగా ఉన్న మహారాష్ట్ర నుంచి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోని ప్రయాణికులను ఢిల్లీకి తీసుకొచ్చినందుకు కేజ్రీవాల్‌ సర్కారు 4 విమానయాన సంస్థలపై ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి ప్రయాణించాలంటే ఆర్టీపీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ రావడాన్ని తప్పనిసరి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఉల్లంఘించినందుకు ఇండిగో, స్పైస్‌జెట్‌, విస్తారా, ఎయిర్‌ఏసియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-04-20T11:03:44+05:30 IST