భారతీయ ప్లాస్మా దాతలు కావాలంటున్న బ్రిటన్ !
ABN , First Publish Date - 2020-08-23T19:00:31+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ చికిత్స కోసం ప్రస్తుతం చాలా దేశాలు అనుసరిస్తున్న విధానాల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. భారత్ సహా పలు దేశాలు ఈ విధానం ద్వారా కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయి.
లండన్: మహమ్మారి కరోనా వైరస్ చికిత్స కోసం ప్రస్తుతం చాలా దేశాలు అనుసరిస్తున్న విధానాల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. భారత్ సహా పలు దేశాలు ఈ విధానం ద్వారా కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయి. కోవిడ్-19 నుంచి కోలుకున్నవారి ప్లాస్మాలో ఈ వైరస్తో పోరాడే ప్రతిరోధకాలు(యాంటీబాడీస్) అధికంగా ఉండడమే దీనికి కారణం. అయితే ఈ చికిత్స ద్వారా ఇంత వరకు ఏ మేర సానుకూల ఫలితాలు వచ్చాయన్న అంశంపై కొంతమంది నిపుణులు అనునామాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... నిపుణుల చెబుతున్న దాని ప్రకారం శ్వేతజాతి ప్రజల కంటే భారతీయ, దక్షిణాసియా వారసత్వ ప్రజల ప్లాస్మా తగినంత అధికంగా యాంటీబాడీస్ కలిగి ఉందట. అందుకే భారతీయ, దక్షిణాసియా వారసత్వ ప్రజలు ప్రాణాంతక వైరస్ బారిన పడిన ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్లాస్మాను దానం చేయాలని బ్రిటన్ చెబుతోంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) శుక్రవారం ప్లాస్మా దాతలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగుల ప్రాణాలను కాపాడగల ఈ యాంటీబాడీ అధికంగా ఉండే ప్లాస్మా ఎంతో అవసరమని ఎన్హెచ్ఎస్ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న మహమ్మారి యూకేలో ఇప్పటికే 41,423 మందిని పొట్టనబెట్టుకుంది. 3,24,601 మందికి ప్రబలింది.