ప్రపంచ దేశాలకు 8కోట్ల టీకా డోసులు: బైడెన్
ABN , First Publish Date - 2021-05-18T14:29:11+05:30 IST
కరోనాతో పోరాడుతున్న వివిధ దేశాలకు ప్రపంచ పెద్దన్న అమెరికా తీపి కబురు అందించింది. ప్రపంచ దేశాలతో కొవిడ్ టీకాలను పంచుకునే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం కీలక ప్రకటన చేశారు.
వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న వివిధ దేశాలకు ప్రపంచ పెద్దన్న అమెరికా తీపి కబురు అందించింది. ప్రపంచ దేశాలతో కొవిడ్ టీకాలను పంచుకునే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. కరోనాను ఖతం చేసేందుకు వివిధ దేశాలకు అతి త్వరలోనే 8 కోట్ల టీకా డోసులు సరఫరా చేయనున్నట్లు బైడెన్ ప్రకటించారు. కాగా, ఇప్పటికే అగ్రరాజ్యం జూన్ నెలాఖరు వరకు వివిధ దేశాలకు 6కోట్ల టీకా డోసులు అందిచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి అదనంగా మరో 2 కోట్ల మోతాదులు కలిపి మొత్తం 8 కోట్ల డోసులు సరఫరా చేయనున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. మొత్తం 8 కోట్ల టీకాలలో.. 2కోట్ల ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా డోసులు ఉంటాయని వైట్హౌస్ పేర్కొంది.
వివిధ దేశాలకు వచ్చే ఆరు వారాల్లోగా 8 కోట్ల కరోనా టీకా డోసులు అందించనున్నట్లు బైడెన్ ప్రకటించారు. కరోనాను అంతమొందించేందుకే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సాయం చేస్తున్నట్లు అధ్యక్షుడు ట్వీట్ చేశారు. "ప్రపంచదేశాల్లో మహమ్మారి కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూ ఉంటే అమెరికా క్షేమంగా ఉండడం కష్టం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ దేశాలకు 8కోట్ల టీకా డోసులు అందించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం చాలా గొప్పది, చాలా ఉపయోగకరమైనది, సరైన సమయంలో తీసుకుంటున్నదని" బైడెన్ చెప్పుకొచ్చారు.