ఉపయోగం లేని కులసంఘాల కార్పొరేషన్లు

ABN , First Publish Date - 2020-10-28T05:38:52+05:30 IST

వివిధ బిసి కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఆయా కులాలను ఉద్ధరించినట్టుగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది...

ఉపయోగం లేని కులసంఘాల కార్పొరేషన్లు

అసలే బీసీ కులాలలో ఐక్యత తక్కువ. ఈ స్థితిలో బీసీలకు సంబంధించి 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా కార్పొరేషన్‌ చైర్మన్లు ఎవరికి వారే వ్యక్తిగతమైన ఎజెండాలతో వేరు వేరుగా వ్యవహరించే ప్రమాదం వుంది. 


వివిధ బిసి కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఆయా కులాలను ఉద్ధరించినట్టుగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఒక రకంగా ఈ కార్పొరేషన్లు కూడా కుల సంఘాల వంటివే. ఎందుకంటే బిసి కులాల కార్పొరేషన్లకు ఆయా కులానికి చెందిన వ్యక్తిని మాత్రమే ఛైర్మన్‌గా నియమించాల్సి వుంది. అందువల్ల ఆయా కులాలవారికి ప్రత్యేకంగా లభించే గుర్తింపుగాని, హోదాకాని వుండదు. సహజంగా ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసే కార్పొరేషన్‌లకు ఆర్థిక స్వాతంత్ర్యం వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయిస్తుంది. కాని ప్రస్తుతం ఎంతో గొప్పగా చెబుతున్న బిసి కులాల కార్పొరేషన్లు ఆర్థికంగా ఎటువంటి అధికారం లేని సంక్షేమ అభివృద్ధి (వెల్‌ఫేర్‌ డెవలప్‌మెంట్‌) కార్పొరేషన్‌లు మాత్రమే. అందువల్ల వీటి ఏర్పాటుతో బిసి కులాలకు ఒరిగేది ఏమీ లేదు. 


రాష్ట్రంలో ఎంతో కీలకమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఎపిఎస్‌ఆర్టీసి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ, పర్యాటక అభివృద్ధి సంస్థ, టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు, తిరుపతి, విశాఖ, మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థలు, ఎపి నైపుణ్య కమిటీ, ఉన్నత విద్యామండలి కమిటీ వంటి దాదాపు 80 ప్రతిష్టాత్మక సంస్థలు వున్నాయి. ఇవి కాకుండా మరో 30 ప్రభుత్వ సలహాదారుల పోస్టులూ వున్నాయి. కేబినెట్‌ హోదా కలిగిన అటువంటి సంస్థలకు ఛైర్మన్లలో కనీసం 20 శాతం పోస్టులలో కూడా బీసీలను నియమించలేదు. ప్రాధాన్యత కలిగిన సంస్థల ఛైర్మన్లుగా ఉన్నతవర్గాల వారిని నియమించి ఎటువంటి ప్రాధాన్యత లేని కులసంఘాల కార్పొరేషన్లకు ఆయా కులాలవారిని చైర్మన్లుగా నియమించి బీసీలను ఉద్ధరించినట్టుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అగ్రకులాలుగా వున్న బ్రాహ్మణ, కాపు కులాల కార్పొరేషన్‌లు ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటయ్యాయి. అందువల్ల వాటికి ఆర్థిక స్వాతంత్య్రం వుంది. అవి నేరుగా ఆర్థిక సాయం చేయగలవు. ఈ కార్పొరేషన్‌ ఛైర్మన్లకు కేబినెట్‌ హోదా ఉంది. బీసీ కుల సంఘాల చైర్మన్లకు కనీసం వాహనం ఇస్తారన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. 


ఎన్‌టి రామారావు అధికారంలోకి రాగానే బీసీ కార్పొరేషన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో రజక, నాయీబ్రాహ్మణులకు అందవలసిన స్థాయిలో సహాయం అందడం లేదనే భావనతో ఆయా కులాల పేరిట ఫెడరేషన్‌లు ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన నిధులను బీసీ కార్పొరేషన్‌ నుంచి అందించేవారు. ఆ తర్వాత శాలివాహన (కుమ్మరి), విశ్వబ్రాహ్మణ వంటి మరో ఏడు చేతివృత్తుల ఫెడరేషన్లు ఏర్పడ్డాయి. ఈ ఫెడరేషన్లకు చెందిన చేతివృత్తిదారులు కో ఆపరేటీవ్‌ సోసైటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫెడరేషన్ల నుంచి కూడా సహాయం పొందేవారు. ప్రస్తుతం ఫెడరేషన్లు రద్దుచేసి, వాటి స్థానంలో కుల సంఘాల కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయడం వల్ల బీసీ కార్పొరేషన్‌తోపాటు ఫెడరేషన్‌లూ పనికిరాకుండా పోవడమే కాకుండా, బీసీ కులాల అభివృద్ధి అనే లక్ష్యం అటకెక్కిందని చెప్పవచ్చు. 


నిజానికి ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరులో నిర్వహించిన బీసీ సదస్సులో బీసీల అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్‌లో ఏడాది 15వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల పేదలకు ఇచ్చే వివిధ పింఛన్లు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, చేదోడు వంటి పథకాలకు ఖర్చు చేసిన నిధులను పరిగణలోకి తీసుకొని బీసీ కులాల అభివృద్ధికి 33 వేల కోట్లు ఖర్చుచేసినట్టుగా ఇటీవల పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 


బీసీలకు సంబంధించి కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం బీసీల ఐక్యతకు విఘాతం కలిగిస్తోందనిపిస్తోంది. అసలే బీసీ కులాలలో ఐక్యత తక్కువ. నిచ్చెన మెట్ల హిందూ సమాజంలో బీసీ కులాల మధ్య పెద్ద కులం, చిన్న కులం అనే అంతరాలు వున్నాయి. ప్రస్తుతం బీసీ జాబితాలో 136 కులాలు వున్నాయి. ఇందులో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, సేవా కులాలు, చేతివృత్తి కులాలు, ఉత్పత్తి కులాలు అంటూ అనేక తేడాలు వున్నాయి. ఈ స్థితిలో బీసీలకు సంబంధించి 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా కార్పొరేషన్‌ చైర్మన్లు ఎవరికి వారే వ్యక్తిగతమైన అజెండాలతో వేరు వేరుగా వ్యవహరించే ప్రమాదం వుంది. కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడమే కాకుండా బలమైన కొన్ని బీసీ కులాలను ఉపకులాల పేరుతో విభజించారు. ఉదాహరణకి గౌడ సామాజికవర్గంలో ఆయా ప్రాంతాలను బట్టి గౌళ్ళ, శట్టిబలిజ, శ్రీశౖన, యాత, ఈడిగ ఉపకులాలు వున్నాయి. అయిదు ఉపకులాలు వున్నప్పటికీ గౌడ సామాజికవర్గంగా వ్యవహరిస్తారు. పెళ్లిళ్ల విషయంలో కూడా ఈ అయిదు కులాలు ఇచ్చిపుచ్చుకొంటాయి. కాని ప్రస్తుతం ఈ అయిదు కులాలకు వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చేపలు పట్టే వృత్తి కలిగిన అగ్నికుల క్షత్రియులలో పల్లెకారులు, వడ్డీల పేరుతో ఉపకులాలు వున్నాయి. అగ్నికుల క్షత్రియ కులాన్ని కూడా ఉపకులాల పేరుతో విభజించి వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో బిసిల ఐక్యత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం వుంది.

అన్నవరపు బ్రహ్మయ్య

Updated Date - 2020-10-28T05:38:52+05:30 IST