నీరజ్ చోప్రాను అభినందించిన పీటీ ఉష
ABN , First Publish Date - 2021-08-08T16:14:29+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్ తొలిసారిగా అథ్లెటిక్స్ విభాగంలో...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్ తొలిసారిగా అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం అందుకుంది. ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన 125 ఏళ్ల అనంతరం జావెలిన్ త్రో పోటీలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించారు. 125 ఏళ్ల క్రితం 1896లో తొలిసారిగా ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా ఒలింపిక్స్లో ప్రతిభ చాటిన నీరజ్ చోప్రాను దేశం యావత్తూ అభినందనలతో ముంచెత్తుతోంది.
ఈ నేపధ్యంలో పరుగుల రాణిగా పేరొందిన ప్రముఖ స్ప్రింటర్ పీటీ ఉష సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రాను అభినందించారు. దీనితోపాటు నీరజ్తో తాను ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... 37 ఏళ్ల తర్వాత నేడు నా కల నిజమయ్యింది. థ్యాంక్యూ మై సన్ నీరజ్ చోప్రా అని కామెంట్ రాశారు. పీటీ ఉషకు ఒలింపిక్స్లో మెడల్ దక్కించుకోవడమనేది తీరని కల. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హర్డిల్స్లో కాంస్య పతకాన్ని ఆమె కొద్దపాటి తేడాతో కోల్పోయారు. ఫలితంగా నాల్గవ స్థానానికే పరిమితం కావాల్సివచ్చింది. ప్రస్తుతం ఆమె బాలుస్సేరీ ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను నడుపుతున్నారు.