కరోనాతో పోరులో వైజాగ్ ప్రజలకు అండగా వేదాంత-వీజీసీబీ
ABN , First Publish Date - 2020-05-28T01:00:04+05:30 IST
కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
వైజాగ్: కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అలాగే లాక్డౌన్ కారణంగా చాలామంది జీవనోపాధి కోల్పోయారు. వైజాగ్లో ఇలాంటి కుటుంబాలకు వేదాంత-వీజీసీబీ(వైజాగ్ జనరల్ కార్గో బెర్త్) సంస్థ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా కొత్తవీధి, చిలకపేట తదితర ప్రాంతాల్లో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న 160 కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తోంది. అలాగే ప్రముఖ ప్రాంతాలైన సీహార్స్ జంక్షన్, కొత్తరోడ్, రీడింగ్ రూమ్ సెంటర్, కురుపాం మార్కెట్, ఓల్డ్ పోస్టాఫీస్ తదితర ప్రదేశాలను ఫ్యూమింగ్ ద్వారా పరిశుభ్రం చేసింది. తద్వారా ప్రజల ఆరోగ్య భద్రతకు తమ వంతు సాయం అందించింది. అలాగే ప్రజలకు ఉచితంగా ఎన్-95 మాస్కులు, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు, హ్యాండ్ గ్లోవ్స్ అందించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ పరిధిలోని హార్బర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇలాంటివి అందించడంతోపాటు పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఫ్యూమింగ్తో పరిశుభ్రం చేస్తోంది. కరోనా మహమ్మారి భయం ప్రజల్లో పోయేవరకు వైరస్పై పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వేదాంత-వీజీసీబీ పేర్కొంది.