కూల్చివేత పత్రికా స్వేచ్ఛకు విఘాతం: ఏపీయూడబ్ల్యూజే
ABN , First Publish Date - 2021-04-09T09:03:15+05:30 IST
విశాఖలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ముద్రణ జరిగే గోడౌన్ను రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అకస్మాత్తుగా కూల్చివేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా...
విజయవాడ సిటీ, ఏప్రిల్ 8: విశాఖలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ముద్రణ జరిగే గోడౌన్ను రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అకస్మాత్తుగా కూల్చివేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. దీన్ని పత్రికా స్వేఛ్చపై దాడిగా పరిగణించింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్థన్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే ప్రభుత్వ చర్యలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఖండిచింది. ‘‘ప్రభుత్వంపై విమర్శనాత్మక వార్తలు రాస్తున్న మీడియాపైనా, పాత్రికేయులపైనా అధికారులు అనేక విధాలా దాడులకు దిగుతున్నారు. ఆంధ్రజ్యోతిపై తాజా దాడి ఇందులో భాగమే. ఇలాంటి కక్షపూరిత చర్యలను ప్రభుత్వం విడనాడాలి’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట్రావు, జీ ఆంజనేయులు ఓ ప్రకనటలో పేర్కొన్నారు.
వ్యతిరేక వార్తలు రాస్తున్నందుకే కూల్చివేత: హేతువాద సంఘం
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తోందనే కారణంతోనే విశాఖలో ఆంధ్రజ్యోతి గోడౌన్ను కూల్చివేసినట్టుగా ఉందని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో దొంగబాబాలు వేలాది ఎకరాలు అక్రమించి, నిర్మించిన ఆశ్రమాలను కూల్చవేసి, ఆ భూములను స్వాధీనం చేసుకుని, ఆ బాబాలను అరెస్టు చేయాలని నార్నె డిమాండ్ చేశారు.