విశాఖ పోర్టు ఆదాయం రూ.606 కోట్లు
ABN , First Publish Date - 2021-04-04T05:54:52+05:30 IST
విశాఖపట్నం పోర్టు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6.984 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసి వరుసగా రెండో ఏడాది కూడా
- 2020-21లో 6.984 కోట్ల టన్నుల కార్గో హ్యాండ్లింగ్
- వరుసగా రెండో ఏడాది తృతీయ స్థానంలో పోర్టు
- చైర్మన్ రామమోహన్ రావు వెల్లడి
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6.984 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసి వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో మూడో స్థానంలో నిలిచిందని పోర్టు చైర్మన్ కె రామమోహన్రావు తెలిపారు. శనివారం నాడిక్కడ పోర్టు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడినప్పటికీ అత్యధికంగా సరుకు హ్యాండిల్ చేశామన్నారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ఆదాయం రూ.606 కోట్లుగా నమోదైందన్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గడచిన ఆర్థిక సంవత్సరం (2020- 21)లో కార్గో హ్యాండ్లింగ్ 4 శాతం తగ్గిందని వెల్లడించారు. 2019-20 లో విశాఖ పోర్టు కార్గో హ్యాండ్లింగ్ 7.272 కోట్ల టన్నులుగా ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో కార్గో హ్యాండ్లింగ్ను 7.7 కోట్ల టన్నుల నుంచి 8.7 కోట్ల టన్నులకు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు రావు తెలిపారు.
పీపీపీ విధానంలో బెర్తుల మెకనైజేషన్: మరోవైపు ఖాళీగా ఉన్న మూడు బెర్తులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మెకనైజేషన్ చేయనున్నట్లు చెప్పారు. కాగా పోర్టులో నౌకల వెయిటింగ్ సమయాన్ని 1.22 గంటల నుంచి 1.15 గంటలకు తగ్గించినట్లు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో పోర్టుకు 2,040 నౌకలు వచ్చాయన్నారు. 2019-20లో పోర్టుకు 2,099 నౌకలు వచ్చాయి.
విశాఖ పోర్టు నుంచి చైనాకు ముడి ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్), ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు ఎక్కువగా రవాణా చేసినట్లు రామమోహన్ రావు వెల్లడించారు. దేశీయంగా బొగ్గు వెలికితీత పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్టీమ్, కోకింగ్ కోల్ దిగుమతి తగ్గిపోయిందని, దీంతో పోర్టుకు 30 లక్షల టన్నుల సరుకు లోటు ఏర్పడిందని చెప్పారు. ఈ సమావేశంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్కుమార్ దూబే పాల్గొన్నారు.